బాన్సువాడ, అక్టోబర్ 21: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని దేశాయిపేట్ సొసైటీ పరిధిలోని సోమేశ్వర్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతుల నుంచి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వంచెప్పినప్పటికీ, రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు.వానకాలం పంటను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, దొడ్ల వెంకట్రామ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సంగ్రాం నాయక్, సొసైటీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, దివిటి శ్రీనివాస్, బీసీ కమిటీ అధ్యక్షుడు గులిపల్లి మొగులయ్య, నాయిని మొగులయ్య, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, టీఆర్ఎస్ ్ట మండల అధ్యక్షుడు మోహన్ నాయక్ , కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.