ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రైతులకు సూచించారు. కామారెడ్డి జిల్లాలో 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం కామారెడ్డి సమీకృత కలెక్టరేట్ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్ పర్సన్ శోభతో కలిసి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది జిల్లాలో 5.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, సమస్యలుంటే 08468-220051 నంబర్కు తెలియజేయాలని సూచించారు.
కామారెడ్డి టౌన్, అక్టోబర్ 21: రైతులు పండించిన ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రపరిచి, ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. కామారెడ్డి జిల్లాలో 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్ పర్సన్ శోభతో కలిసి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ. 1960, సాధారణ రకానికి రూ.1940 చెల్లిస్తున్నట్లు చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమస్యలున్నవారు 08468220051 నంబర్కు తెలియజేయాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఉంటే మండల స్థాయి కమిటీలకు తెలియజేసి పరిష్కరించుకోవాలని చెప్పారు. మండల స్థాయిలో పరిష్కారం కాకపోతే డివిజన్ స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసుకోవాలని కోరారు. ఈసారి 5 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రైతులు ధాన్యం విక్రయించిన సమయంలోనే పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ ఖాతా పుస్తకం, ఆధార్ కార్డు నకలు అందజేస్తే, డబ్బులు త్వరగా అందే వీలుందని సూచించారు. రైతులకు సహకార సంఘాల కార్యదర్శులు అవగాహన కల్పించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల నుంచి పంపిన లారీలను రైస్ మిల్లర్లు 12 గంటల లోపు అన్లోడింగ్ చేసేలా చూడాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని ఈ సందర్భంగా పలువురు సింగిల్ విండో చైర్మన్లు మంత్రిని కోరారు. రైస్ మిల్లర్స్ నుంచి వచ్చే గన్నీ బ్యాగులు తక్కువగా, చినిగిపోయి వస్తున్నాయని వివరించారు. గన్నీ బ్యాగులను నాణ్యతతో కూడినవి కొనుగోలు కేంద్రాలకు అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఇన్చార్జి అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ అంజి రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం జితేంద్ర ప్రసాద్, ఎంపీపీలు, జడ్పీటీసీలు విండో చైర్మన్లు, కార్యదర్శులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.
అన్నదాతకు అండగా నిలిచేది కేసీఆరే!
వేల్పూర్, అక్టోబర్ 21 : రైతుకు ఏ ఆపద వచ్చినా ముందు నిలబడేది సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆయన దార్శనికతకు, రైతులపై ఉన్న ప్రేమకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలే నిదర్శనమన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా వరి కొనుగోలు కేంద్రాలు లేకున్నా రైతులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ముఖ్యంగా పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో వరి కొనుగోలు కేంద్రాలు లేవని తెలిపారు. దీంతో అక్కడ రైతులు రూ.12 వందలకే పోటీ పడి మరీ అమ్ముకుంటున్నారన్నారు. అదే మన రాష్ట్రం లో రైతుల కోసం సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వా న్ని ఒప్పించి వరి ‘ఏ’ గ్రేడ్ రకానికి రూ.19 60, సాధారణ రకానికి రూ.1940 మద్దతు ధర ఇస్తున్నారని వివరించారు. నిబంధనల ప్రకా రం తేమ శాతంతో తాలు లేని ధాన్యాన్ని రైతులు తెస్తే కిలో తరుగు కూడా తీయకుండా చూసే బాధ్యత తనదని మం త్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో మూడు రోజుల పాటు ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి, ఒప్పించి మన రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారన్నారు. నిజామాబాద్ జిల్లాలో 458 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.