బాన్సువాడ, అక్టోబర్ 23 : మధ్యాహ్న భోజనం వికటించి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ ప్రాథమిక పాఠశాలలో గురువారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ఎప్పటిలాగే గురువారం వంట చేసి పాఠశాలలో సుమారు 100 మందికి భోజనం వడ్డించారు. ఉపాధ్యాయులు సైతం పాఠశాలలోనే భోజనం చేశారు. భోజనం తిన్న వారిలో 30 మంది విద్యార్థులకు వాంతులు, తలతిప్పడం, కడుపులో నొప్పి రావడంతో వెంటనే అంబులెన్స్లో బాన్సువాడ ఏరి యా దవాఖానకు తరలించారు. చాలా రోజులుగా నిల్వ ఉ న్న వస్తువులను వాడడంతో ఈ సంఘటన చోటుచేసుకున్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామ్ రెడ్డి, సర్పంచ్ నారాయణ రెడ్డి, ఎంపీటీసీ హన్మాండ్లు, ఎంఈవో, తహసీల్దార్ గంగాధర్ గ్రామానికి చేరుకొని విద్యార్థులను దవాఖానకు తరలించి చికిత్స అందే విధంగా చర్యలు చేపట్టారు. దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన మాట వాస్తవమేనని, శాంపిళ్లను ల్యాబ్కు పంపామని తెలిపారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని ఎటువంటి ప్రమాదం లేదని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు.
పరామర్శించిన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి
విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న స్పీక ర్ పోచారం శ్రీనివాస రెడ్డి దవాఖానకు చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యా హ్న భోజన తీరును పరిశీలించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను స్పీకర్ ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.