నిజామాబాద్: పేద, మధ్య తరగతి కుటుంబాల తల్లిదండ్రులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆర్థికంగా చేయూతనిస్తున్నాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆదివారం నగర శివారులోని క్యాంపు కార్యాలయంలో డిచ్పల్లి మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్సీ వి.జి.గౌడ్తో కలిసి ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి లబ్ధిదారులు అండగా నిలువాలని కోరారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా.. కష్టకాలంలోనూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ వి.జి.గౌడ్ మాట్లాడుతూ ఆడబిడ్డలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో పెళ్లీడుకొచ్చిన వారి వివాహాలు జరిపించే సమయంలో ప్రభుత్వం కానుకగా ఆర్థిక సాయం అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలు పురోభివృద్ధిని సాధించేందుకు సీఎం కేసీఆర్ పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు కాకపోవడంతో ఏండ్ల తరబడి ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడే పరిస్థితి నెలకొని ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు భిన్నంగా అన్నిరంగాల్లోనూ అభివృద్ధి కండ్లకు కొట్టొచ్చినట్లు కనిపించడం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమమే అందుకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో డిచ్పల్లి మండల జడ్పీటీసీ దాసరి ఇందిర, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, నాయకులు దాసరి లక్ష్మీనర్సయ్య, ఒడ్డెం నర్సయ్య, జీనియస్ నారాయణరెడ్డి, మహేందర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ రావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.