తాండూరు, వికారాబాద్కు గ్రావిటీతో నీరు
మైలారం వద్ద 3 టీఎంసీల రిజర్వాయర్
రిజర్వాయర్కు ఉమామహేశ్వరం పేరు
3 టీఎంసీల సామర్థ్యానికి గట్టు రిజర్వాయర్
వెంటనే ప్రణాళికలు రూపొందించాలి
కావాల్సిన నిధులను సమకూరుస్తాం
ఏడాది చివరికల్లా ప్రాజెక్టు పూర్తి కావాలి
పాలమూరు ఎత్తిపోతలపై సీఎం కేసీఆర్
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రతి ఎకరాన్ని కృష్ణా జలాలతో తడపాలంటే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, కల్వకుర్తి ఎత్తిపోతలతో అనుసంధానించే ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు, జిల్లాను ఆనుకొని వున్న తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సాగునీటిని అందించేందుకు కార్యాచరణను సిద్ధంచేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఆదివారం ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రారంభించిన సమీక్షా సమావేశం సోమవారం కూడా కొనసాగింది. కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాల పనుల విస్తరణకు సిద్ధం చేయాల్సిన ప్రణాళికలకు అనుసరించాల్సిన కార్యాచరణపై సీఎం మార్గదర్శనం చేశారు.
కృష్ణా ప్రవాహం అక్టోబర్వరకే ఉంటుందని, ఈ లోపు మనకు కేటాయించిన నీటి వాటాను వీలైనంత ఎత్తిపోసుకొని పాలమూరులో ఎండిన బీళ్లను తడుపుకోవాలన్నారు. నిర్మాణంలో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతలలో రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువ ఉండటంతో దాని పరిధిలోని ఆయకట్టుకు నీరందడం కష్టమని చెప్పారు. కల్వకుర్తి ఆయకట్టును పూర్తిస్థాయిలో స్థిరీకరించేందుకు పాలమూరు లిఫ్టు పనులను వేగంగా కొనసాగించి, ఎక్కడికక్కడే అనుసంధానించుకోవాలని సూచించారు. ఉద్దండాపూర్ రిజర్వాయర్ను నింపుకొని కొడంగల్, నారాయణపేట్, పరిగి, తాండూరు, చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల పరిధిలో సాగుభూములకు గ్రావిటీ ద్వారా నీరందించే అవకాశాలను సీఎం మ్యాపుల ద్వారా పరిశీలించి, అధికారులతో చర్చించారు. ప్రధాన కాల్వల నిర్మాణం సహా, ప్రతి చెరువును నింపేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో నీరందని సాగుభూములనూ తడపాలని సూచించారు. మహబూబ్నగర్ నుంచి కిందికి ఉన్న భూములకు సాగునీరందించే విధివిధానాలపై చర్చించిన సీఎం కేసీఆర్.. పైకి నీళ్లను తీసుకెళ్లి, తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు నీరందించేలా కాల్వల నిర్మాణంపై చర్చించారు. కాల్వలు, వాగుల ద్వారా నీటిని తీసుకెళ్లే క్రమంలో చెక్డ్యాములు పటిష్ఠంగా ఏర్పాటుచేసుకోవాలని, చెరువులు నింపుకోవాలని తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్, ఘన్పూర్, మూసాపేట, అడ్డకల్ మండలాల్లో తాగునీటిని తీసుకెళ్లే మార్గాలను డిజిటల్ స్క్రీన్పై పరిశీలించారు. కాంటూరు లెవల్స్ను పరిశీలించారు. వీలైనంత వరకు గ్రావిటీ ద్వారా నీటిని మహబూబ్నగర్ జిల్లా చుట్టూ ఎట్లా తిప్పవచ్చునో సుదీర్ఘంగా చర్చించారు.
పాలమూరుపై దృష్టి
కాళేశ్వరం పనులు పూర్తయినందున ఇక ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులు పాలమూరు ఎత్తిపోతలపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించాలని, వారంవారం క్షేత్రస్థాయి పర్యటనలు జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నియోజకవర్గాలవారీగా చేపట్టాల్సిన భూసేకరణ, నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ వ్యవహారాలను స్థానిక ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్నారు. ఇక పర్యటనలు మొదలవుతున్నందున అనువైనచోట ఒక గెస్టుహౌజ్ నిర్మించాలని సూచించారు. ‘యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి కాళేశ్వరం పూర్తిచేసుకున్నాం. అదే స్ఫూర్తితో పాలమూరు ఎత్తిపోతల ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసుకోవాలి. ఇక మిగిలింది సీతారామ, డిండి.. ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులే. కావాల్సిన నిధులన్నీ సంపూర్ణంగా సమకూరుస్తాం. వాటినీ సత్వరమే పూర్తిచేసుకుందాం. పాలమూరు-కల్వకుర్తి, పాలమూరు-జూరాల పథకాల అనుసంధానంతోనే ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను పూర్తిస్థాయిలో సస్యశ్యామలం చేసుకోవచ్చు’ అని సీఎం అన్నారు.
60 వేల ఎకరాలకు సాగు- రిజర్వాయర్లకు పేర్లు
అచ్చంపేట ఎత్తిపోతల సర్వే పనులను సత్వరమే పూర్తిచేసి, అంచనాలను పాలనా అనుమతులకోసం పంపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ‘బల్మూర్, లింగాల అమ్రాబాద్ ప్రాంతంలో 60 వేల ఎకరాలకు సాగునీరందించాలి. ఇందుకోసం ఏదుల రిజర్వాయర్ నుంచి 22 కిలోమీటర్లు కాల్వ తీసి, లింగాల దగ్గర లిఫ్టును ఏర్పాటుచేయాలి. అక్కడినుంచి మైలారం దగ్గర 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ను ఏర్పాటుచేయాలి’ అన్నారు. దానికి ఉమామహేశ్వరం అన్న పేరును సీఎం సూచించారు. అక్కడినుంచి చంద్రసాగర్కు కాల్వ ద్వారా నీరందించి, అక్కడినుంచి అమ్రాబాద్ మండలంలోని మన్ననూరులో 1.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ను ఏర్పాటుచేసి, ఎత్తిపోయాలన్నారు. ఈ రిజర్వాయర్కు స్థానిక చారిత్రక నేపథ్యమున్న చెన్నకేశవుని పేరును సూచించారు. వీటి సర్వే పనులను త్వరగా పూర్తిచేయాలని, మే నెలలో శంకుస్థాపన చేసుకుందామన్నారు.
కోయిల్సాగర్ సామర్థ్యాన్ని పెంచడానికున్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రాజోలిబండ ప్రాజెక్టు పరిధిలో ఉన్న చిన్నోనిపల్లి రిజర్వాయర్ను పూర్తిచేయాలని, ఆర్డీఎస్ కాలువ ఆధునీకరణ పనులను పూర్తిచేయాలని, తుమ్మిళ్ల లిఫ్టు మిగిలిన పనులనుకూడా పూర్తిచేయాలని ఆదేశించారు. గట్టు రిజర్వాయర్ను మూడు టీఎంసీల సామర్థ్యానికి పెంచాలని చెప్పారు. జూరాల మీద ఆధారపడిన నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్, జూరాల సొంత ఆయకట్టుతోపాటు, మిషన్ భగీరథకు నిరంతరం నీరందించే బరువంతా జూరాలపైనే ఉన్నందున అక్కడ నీటి లభ్యతను పెంచుకోవాలని చెప్పారు. అందులో భాగంగా పాలమూరు- జూరాలను అనుసంధానం చేయడం వల్ల సహజమైన నీరు, రీ జనరేటెడ్ వాటర్తో.. కెనాల్ ఏడాది పొడవునా నీటితో కళకళలాడుతుందన్నారు.
జూరాల పరిధిలో 24 మున్సిపాలిటీలు, గ్రామాలకు తాగునీరు, పరిశ్రమలకు నీరందించే వెసులుబాటు తద్వారా కలుగుతుందన్నారు. సమావేశంలో మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్, ఎస్ నిరంజన్రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అబ్రహం, అంజయ్య యాదవ్, కృష్ణమోహన్రెడ్డి, నరేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, జైపాల్యాదవ్, రామ్మోహన్రెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, దివాకర్రావు, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇరిగేషన్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్రావు, ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, సలహాదారు పెంటారెడ్డి, సీఈలు వీ రమేశ్, శ్రీనివాస్, హమీద్ఖాన్, ఎస్ఈలు పాల్గొన్నారు.