మనకు వరం కాళేశ్వరం.. సీఎం కేసీఆర్ విజన్కు తార్కాణం
వానలకు ముందే లక్ష్మీబరాజ్లోకి జల ప్రవాహం
ఒక్కరోజే వచ్చి చేరిన 6,700 క్యూసెక్కుల నీళ్లు
అంచనా వేసినట్టే గోదావరిలోకి ప్రాణహిత పరవళ్లు
రెండేండ్లుగా వానలకు ముందే బరాజ్కు పలకరింపు
ఎండాకాలంలోనూ నిత్యం నీటి వనరులతో కళకళ
కర్షకుడి తపస్సుకు ఫలం.. పాలకుడి స్వప్నం సాకారం
నీళ్లున్నచోట నిర్మాణంతోనే ఎల్లప్పుడూ ప్రవాహం
ఒక ఇంజినీరింగ్ అద్భుతం.. కాళేశ్వరం ఎత్తిపోతలు
ప్రాజెక్టును ప్రారంభించి రేపటితో మూడేండ్లు పూర్తి
ఏ సమయం ఎట్ల వచ్చినా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఎల్ఎండీ, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లకు ఏటా నీరందుతుంది. నిజాంసాగర్కూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే నీరందిస్తాం. అవసరమైన పక్షంలో ఎస్సారెస్పీకి కూడా ఈ ప్రాజెక్టు నుండే నీటి పంపింగ్ చేయడానికి అవకాశమున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చివేసింది.
– ముఖ్యమంత్రి కేసీఆర్ (19-1-2021)
వానకాలం మొదలైనా.. వానలింకా పడనేలేదు.. జీవనదులైన కృష్ణా, గోదావరికి పెద్దగా వరద రాలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశ అయిన లక్ష్మీ బరాజ్కు అప్పుడే జల పరవళ్లు మొదలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాణాధారమైన ప్రాణహిత నుంచి ఆదివారం ఒక్కరోజే ఆరున్నరవేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. గత మూడేండ్లుగా ఇదే పరిస్థితి. నీటిని ఎక్కడ ఒడిసిపట్టాలన్న దానిపై సీఎం కేసీఆర్ చేసిన సుదీర్ఘ మేధో మథనంతో సాకారమైన అద్భుతమిది. ఆయన దార్శనికతకు, దక్షతకు ఈ ప్రాజెక్టు తార్కాణం. అందుకే.. కాళేశ్వరం.. తెలంగాణకు వరం! కాళేశ్వరం నీటిని ఎత్తిపోయడం మొదలు పెట్టి.. రేపటికి సరిగ్గా మూడేండ్లు!
ఎన్నో అనుమానాలు! మూడే మూడేండ్లు.. అందరి అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఒక కర్షకుడి తపస్సు ఫలించింది. ఒక పాలకుడి స్వప్నం సాకారమైంది. అనూహ్యంగా మేడిగడ్డ వద్ద గోదావరి తన దిశను మార్చుకొన్నది. తెలంగాణవైపు అడుగులు వెనక్కి వేసింది. తెలంగాణకు జీవనాడిగా కాళేశ్వరం ప్రాజెక్టు అవతరించింది. దేశంలోనే మునుపెన్నడూ ఎవరూ సాధించని రికార్డు కాళేశ్వరం.. భారతదేశ చరిత్రలో ఒక స్వర్ణ పుట ఈ ఎత్తిపోతల. 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీరు.. ఎనిమిదేండ్ల క్రితం తడారిపోయిన రైతు కండ్లల్లో మళ్లీ నీరు ఉబికివచ్చింది.. కానీ.. ఆనందబాష్పమై!!
హైదరాబాద్, వరంగల్ ప్రతినిధి, జూన్ 19 (నమస్తే తెలంగాణ): భారీ యంత్రాలు.. ఊహించలేని నిర్మాణాలు.. భారీ బరాజ్లు.. వాటిని మించిన సంకల్పాలు.. మహోన్నత లక్ష్యాలు! సాగునీటి కష్టాల నుంచి తెలంగాణను గట్టెక్కించి.. బంగారు తెలంగాణకు పునాదులేసిన బాహుబలి అది! రైతుల ఈతి బాధలు తెలిసిన ఓ రాజకీయ మేధస్సు.. ఇంజినీర్ అవతారమెత్తి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యవసాయిక యజ్ఞమది! సాగునీటి ప్రాజెక్టులంటే ఏండ్లతరబడి కొనసాగే దుస్సంప్రదాయాన్ని చీల్చి చెండాడి.. తెలంగాణ తలాపున.. కాలంతో పోటీపడుతూ నిర్మాణం పూర్తిచేసుకొన్న అపురూప జలనిధి.. పెట్టిన పెట్టుబడికి పదింతల ఫలితాన్నిస్తున్న అక్షయపాత్ర! నదినే జలాశయంగా మార్చి.. ప్రతి నీటిచుక్కను ఒడిసిపడుతున్న అద్భుత కట్టడం! సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలోనే కొత్త అధ్యాయాన్ని లిఖించిన నిర్మాణం.. కాళేశ్వరం! నిర్మాణం పూర్తిచేసుకొని మంగళవారానికి (జూన్ 21) సరిగ్గా మూడేండ్లు. వానాకాలం పూర్తిగా మొదలుకాకుండానే.. సక్కగ ఒక చుక్క వాన పడకుండానే కాళేశ్వరం పరవళ్లు తొక్కుతున్నది. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి మొదలు దిగువ ఉన్న పార్వతీ, సరస్వతీ బరాజ్లకు ఎగువ నుంచి ఒక్క చుక్క నీరు రావడం లేదు. అయినప్పటికీ వాటి దిగువన ఉన్న లక్ష్మీబరాజ్కు మాత్రం అప్పుడే నీటి ప్రవాహం మొదలైంది. సగటున ఆరున్నర వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ) వద్ద ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు 6700 క్యూసెక్కుల నీరు వచ్చింది. గత ఏడాది జూన్ 19న 14,500 క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది. ముందు అంచనా వేసినట్టుగానే గతంలోనూ ఇదే తరహాలో ఇదే సమయానికి ప్రాణహిత పరవళ్లు తొక్కి బరాజ్కు చేరుకున్నది.
రీ ఇంజినీరింగ్ అద్భుతం
తెలంగాణలోని నీటి వనరులతో ప్రతి ఎకరాను పారించే అవకాశాలను సీఎం కేసీఆర్ ముందే గుర్తించడం వల్లనే కాళేశ్వరం సాధ్యమైంది. కాళేశ్వరం నిర్మించిన ప్రదేశమే అద్భుత నిర్మాణానికి గొప్పబలం. సాగునీటిరంగంలో సమగ్ర అవగాహన కలిగిన సీఎం కేసీఆర్ ఎండాకాలంలోనూ నీటి ప్రవాహం వచ్చే మేడిగడ్డ ప్రాంతాన్ని ప్రధాన బరాజ్ నిర్మాణానికి ఎంచుకొన్నారు. ప్రాణహిత, గోదావరి నదుల నీటిని ఒడిసిపట్టి తెలంగాణను పంటలతో పచ్చగా మార్చాలంటే నిత్యం నీటి ప్రవాహం ఉండే స్థలమైతేనే సాధ్యమవుతుందని భావించారు. ఇందుకోసం ఎంతో మేధోమధనం చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై చర్చోపచర్చలు చాలానే జరిగాయి. కాళేశ్వరం పూర్వరూపమైన ప్రాణహిత-చేవెళ్ల రీడిజైనింగ్పై ఎన్నో రాద్ధాంతాలు.. ప్రాజెక్టు నిర్మాణ స్థల మార్పుపై మరెన్నో విమర్శలు.. మేడిగడ్డ సరికాదు.. తమ్మిడిహట్టి సరైనదంటూ అశాస్త్రీయ వాదాలు.. కేసీఆర్ విజన్ నేడు.. అవన్నీ అసత్యమని తేల్చిపారేసింది. మూడేండ్ల కాల పరీక్షలో ప్రతిపక్షాల ఆరోపణలు నిరర్థకామని తేలిపోయింది. అందుకు కాళేశ్వరం వద్ద నేడు గత మూడేండ్లుగా వస్తున్న ప్రవాహాలే నిదర్శనం. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో గోదావరిలో, కృష్ణాలో ఇప్పటికీ ఎక్కడా ఒక్క చుక్క వాన కురవకముందే.. ప్రాణహితలో అప్పుడే జలసవ్వళ్లు మొదలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకభూమికగా నిలిచే లక్ష్మీ బరాజ్కు అప్పుడే జలప్రవాహాలు షురూ అయ్యాయి. సీఎం కేసీఆర్ కాళేశ్వరం విజన్ పర్ఫెక్ట్ ప్లాన్తో చేపట్టడం వల్లనే ఇది సాధ్యమైంది. వెక్కిరించిన నోళ్లు మూగబోయాయి. అందుకే ఎల్లప్పుడూ నీటి ప్రవాహం ఉండే ప్రదేశాన్ని ఎంపిక చేశారు. నాటి ముఖ్యమంత్రి దూరదృష్టి.. ఇవాళ తెలంగాణకు వరంగా మారింది.
నాడు నీళ్లులేని చోట ప్రాజెక్టులు..
1465 కిలోమీటర్ల పొడవున పారే గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి ఉపనదులు తెలంగాణ ప్రాంతంలో కలుస్తాయి. గోదావరిలో ఈ రెండు నదుల భాగస్వామ్యం దాదాపు 3500 టీఎంసీలు. ఈ ఉపనదులు కలిశాక ప్రాజెక్టులు నిర్మిస్తే నీటి వినియోగం నిరంతరం జరుగుతుంది. కానీ.. గత ఆరుదశాబ్దాల్లో గోదావరిపై నిర్మించిన, ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ ప్రాణహిత, ఇంద్రావతి బేసిన్లకు ఎగువన చేసినవే. అప్పర్ గోదావరి (జీ1), (జీ2), ప్రవర (జీ3), మంజీరా (జీ4), మధ్య గోదావరి (జీ5), మానేరు (జీ6)పై ఆధారం చేసుకొన్నవే కావడం అందుకు నిదర్శనం. ఎగువ నుంచి వరద తక్కువైందని తెలిసినా శ్రీరాంసాగర్ను ఆధారం చేసుకుని వరద కాల్వ.. దాని దిగువన ప్రధాన గోదావరిపై ఎల్లంపల్లి ప్రాజెక్టు, కడెంపై మరో ప్రాజెక్టు.. గుత్ప, అలీసాగర్ వంటి ప్రాజెక్టులు చేపట్టారు. ప్రాణహిత, ఇంద్రావతి వంటి కీలకమైన ఉపనదులు కలిసే ప్రాంతాలను వీడి గోదావరి ఉపనది అయిన మానేరుపై ఎగువ మానేరు మధ్యమానేరు, దిగువ మానేరు ప్రాజెక్టులు నిర్మించారు. నిజాంసాగర్కు ఉరేసి సింగూరు కట్టారు. ఇన్ని కట్టినా.. నీటి లభ్యత లేక.. అన్నీ వృథా అయిపోయాయి.
నేడు అన్నింటికీ జీవధారగా కాళేశ్వరం..
ఈ పరిస్థితులన్నింటినీ కూలంకషంగా అధ్యయనంచేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి సమీపంలో మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై 16.17 టీఎంసీల నీటి నిల్వసామర్థ్యంతో 100 మీటర్ల ఎత్తయిన బరాజ్ను 85 గేట్లతో కట్టారు. మేడిగడ్డ నుంచి సుమారు 17 కిలోమీటర్ల మేర నీటి నిలువ సామర్థ్యంతో ఉండేలా నిర్మించిన లక్ష్మీ బరాజ్లో నీటిని ఒడిసి పట్టి గోదావరి నది తన ప్రవాహాన్ని మార్చుకుని తెలంగాణలోని అత్యధిక ప్రాంతాన్ని పచ్చగా మారుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్మీ బరాజ్ది కీలకభూమిక. కన్నెపల్లిలో నిర్మించిన లక్ష్మీ పంప్హౌజ్ నుంచి 17 మోటర్లు నీటిని ఎత్తిపోస్తుంటాయి. ప్రాణహితకు దిగువన కట్టడం వల్లే ఎండాకాలంలో కూడా నీటి ప్రవాహం కొనసాగే పరిస్థితి నెలకొన్నది. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే గోదావరిలో మన 954 టీఎంసీల్లో 750 టీఎంసీలకు పైగా వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది. ప్రాణహిత జలాలను ఎదురెక్కించడం వల్ల 150 కిలోమీటర్ల ప్రధాన గోదావరిని సజీవంగా మారింది. ఎగువ నుంచి వరద వచ్చినా, రాకున్నా ఎల్లంపల్లికి ఢోకా లేకుండా పోయింది. శ్రీరాంసాగర్ జలాశయానికి ఏడాది పొడవునా జలకళ. దైవాదీనంగా మానేరుపై నిర్మించిన ఎగువ, మధ్య, దిగువ మానేరుకు కాళేశ్వర గంగ శాశ్వత భరోసా కల్పించింది. మంజీరా మొహం చాటేసినా, సింగూరుకు కాళేశ్వరం ఊపిరిలూదింది. ఆయకట్టుకు మోక్షం లభించింది. అదే రీతిన హల్దీ వాగుద్వారా చారిత్రక నిజాంసాగర్కు ప్రాణహిత జలాలతో ప్రాణం పోస్తున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రగతి కాళేశ్వరానికి ముందు, ఆ తరువాత అనే నిర్వచించవచ్చు. అందుకు నేడు గత ప్రాజెక్టుల కింద సాగవుతున్న ఆయకట్టు, వస్తున్న పంటల ఉత్పత్తే అందుకు ఒక సజీవ సాక్ష్యం.