కాబూల్: రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా రాజధాని కాబూల్లోగగనతలాన్ని మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో అక్కడి ఎయిర్పోర్ట్ నుంచి ఎలాంటి విమాన రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. అక్కడ మిగిలిపోయిన భారతీయులను తీసుకురావడానికి సోమవారం మధ్యాహ్నం ఎయిరిండియా విమానాలు అక్కడికి వెళ్లాల్సి ఉంది. అయితే ఎయిర్స్పేస్ మూసివేయడంతో ఇప్పుడు అక్కడికి వెళ్లే పరిస్థితి లేదని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.
అంతేకాదు అమెరికా నుంచి ఇండియాకు వస్తున్న పలు ఎయిరిండియా విమానాలను మరో మార్గంలో పంపే అవకాశాలు ఉన్నాయి. షికాగో నుంచి ఢిల్లీ వచ్చే విమానం, శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీ వచ్చే విమానాలను గల్ఫ్ దేశాలకు తరలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
ఎలాగైనా సరే దేశం వదిలి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో ఆదివారం నుంచీ కాబూల్ ఎయిర్పోర్ట్ను వేల మంది ప్రజలు వస్తున్న విషయం తెలిసిందే. అక్కడి విమానాల్లోకి ఎక్కడానికి జనాలు ఎగబడుతున్నారు. దీంతో అక్కడే ఉన్న అమెరికా దళాలు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది.