న్యూఢిల్లీ : కాంగ్రెస్ నుంచి కాషాయ పార్టీలో చేరిన రాజ్యసభ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపలో ప్రాధాన్యత లేదని, ఆయన బ్యాక్ బెంచ్ నేతగా మిగిలిపోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై సింధియా బదులిచ్చారు. తాను దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో సేవలందించిన సమయంలో రాహుల్ తన పట్ల ఏమాత్రం శ్రద్ధ తీసుకున్నారని జ్యోతిరాదిత్య సింధియా నిలదీశారు. ఇప్పుడు తన పట్ల ప్రేమ కురిపిస్తున్న రాహుల్ అప్పుడు ఎలా వ్యవహరించారో తెలుసునని వ్యాఖ్యానించారు.
కాగా రాహుల్ గాంధీ ఇటీవల యూత్ కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్లో ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని కానీ ఆయన బీజేపీలో బ్యాక్బెంచ్ నేతగా మిగిలిపోయారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పార్టీని బలోపేతం చేసే అవకాశం ఇచ్చామని, ఆయన ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారని తాను అప్పట్లో సింధియాతో అన్నానని రాహుల్ గుర్తుచేశారు.