తిరుమల : తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జరుగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఆషాడ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి తిరుపతిలోని గోవింద రాజస్వామికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఉత్సవాలు మూడు రోజులపాటు ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించనున్నారు. తొలిరోజు 19న కవచాధివాసం, 20న కవచ ప్రతిష్ఠ, జూలై 21న కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో శతకలశ స్నపనతిరుమంజనం జరుపనున్నారు. తర్వాత మహాశాంతి హోమం, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత గోవింద రాజస్వామివారి ఉత్సవరులను ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించనున్నారు.