హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమిలైన సంగతి తెలిసిందే. హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉజ్జల్ భూయాన్ ఈ నెల 28న ప్రమాణస్వీకారం చేయనున్నారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణం చేయించనున్నారు.
ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీశ్చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మే 17న చేసిన సిఫారసును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 19న ఆమోదించారు. ఆ వెంటనే కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. అస్సాం రాష్ర్టానికి చెందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2011 అక్టోబర్ 17న గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు. 2019 అక్టోబర్ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ఆయన తండ్రి సుచేంద్రనాథ్ భూయాన్ సీనియర్ న్యాయవాది. అస్సాం అడ్వొకేట్ జనరల్గా కూడా పనిచేశారు.
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 1964 ఆగస్టు 2న గువాహటీలో జన్మించారు. అక్కడి డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, కాటన్ కాలేజీలో ఇంటర్, దిల్లీలోని కిరోరి మాల్ కాలేజీలో డిగ్రీ చేశారు. గువాహటీ ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ, గువాహటీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్ఎం చేశారు. 1991 మే 20న అస్సాంలో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 16 ఏండ్లపాటు ఆదాయపు పన్ను శాఖకు స్టాండింగ్ కౌన్సిల్గా, 2008 డిసెంబర్ 3న ఆదే శాఖకు సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్గా, 2002 నుంచి 2006 వరకు గువాహటీ హైకోర్టు-మేఘాలయ బెంచ్లో ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా చేశారు. 2005 నుంచి 2009 వరకు అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ ప్రత్యేక న్యాయవాదిగా, 2010 మార్చి 3న గువాహటీ హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్గా సేవలందించారు. అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరం రాష్ర్టాల్లో న్యాయవాదిగా పని చేశారు. కేంద్ర పరిపాలనా టిబ్యునల్ (క్యాట్), గువాహటీ బెంచ్, అస్సాం బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో కూడా ప్రాక్టీస్ చేశారు. అన్ని స్థాయి కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఆయన సొంతం.