రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్
ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేశారు. రాజ్భవన్లో మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హాజరయ్యారు. జస్టిస్ భూయాన్ దైవసాక్షిగా, ఇంగ్లిష్లో ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్, సీఎం ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. పుష్పగుచ్ఛం ఇచ్చేప్పుడు పకగా ఉన్న గవర్నర్ను మధ్యలోకి రావాలని సీఎం ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష ఉపనేత కేఆర్ సురేశ్రెడ్డి, జస్టిస్ భూయాన్ సతీమణి సంఘమిత్ర, కుమార్తె తదితరులు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందులో సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పాల్గొన్నారు.