హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీశ్చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం నిర్ణయం తీసుకున్నది. తెలంగాణతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్, గువాహటి హైకోర్టుల్లో నూతన ప్రధాన న్యాయమూర్తులను నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సింఘీని ఉత్తరాఖండ్ సీజేగా, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమ్జాద్ ఏ సయీద్ను హిమాచల్ప్రదేశ్ సీజేగా, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎస్ షిండేను రాజస్థాన్ సీజేగా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రష్మిన్ ఎం ఛాయాను అస్సాం సీజేగా నియమించాలని పేర్కొన్నది. ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వ అంగీకారంతో రాష్ట్రపతికి నివేదించనున్నది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన వెంటనే నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ తర్వాత వారు కొత్త సీజేలుగా ప్రమాణం చేస్తారు.
తెలంగాణకు ఐదో సీజే
2019 జనవరి 1న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటైన తర్వాత ప్రధాన న్యాయమూర్తి మారడం ఇది ఐదోసారి. తెలంగాణ హైకోర్టుకు తొలుత జస్టిస్ రాధాకృష్ణన్, ఆ తర్వాత జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ హిమాకోహ్లీ ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించాక నిరుడు అక్టోబర్ 12న జస్టిస్ సతీశ్చంద్రశర్మ సీజే అయ్యారు. అదే ఏడాది అక్టోబర్ 22న ముంబై హైకోర్టు నుంచి బదిలీపై తెలంగాణ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇప్పుడు సీజేగా పదోన్నతి పొందనున్నారు.
న్యాయవాది కుటుంబం నుంచి..
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 1964 ఆగస్టు 2న గౌహతిలో జన్మించారు. ఆయన తండ్రి సుచేంద్రనాథ్ భూయాన్ సీనియర్ న్యాయవాది. అస్సాం రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా కూడా పనిచేశారు. గౌహతిలోని డాన్బాసో ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించిన జస్టిస్ భూయాన్.. ఆ తర్వాత కాటన్ కాలేజీలో చదివారు. ఢిల్లీలోని కిరోరిమల్ కాలేజీలో డిగ్రీ, గౌహతిలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ, గౌహతి విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 2011 అక్టోబర్ 17న గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2013లో రెగ్యులరైజ్ అయ్యారు.