న్యూఢిల్లీ, ఆగస్టు 10: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ను (యూయూ లలిత్) నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులపై సంతకాలు చేశారు. ఈ మేరకు బుధవారం న్యాయశాఖ వెల్లడించింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆ మరుసటి రోజు అంటే ఆగస్టు 27న సుప్రీంకోర్టు 49వ సీజేగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణం చేయనున్నట్టు న్యాయశాఖ తెలిపింది. తదుపరి సీజేఐగా ప్రమాణం చేయనున్న జస్టిస్ లలిత్కు ప్రస్తుత సీజేఐ జస్టిస్ రమణ శుభాకాంక్షలు తెలియజేశారు. జస్టిస్ లలిత్ పదవీకాలం మూడు నెలల్లోపే ముగియనున్నది. నవంబర్ 8న రిటైర్ కానున్నారు.
జస్టిస్ లలిత్ ప్రస్థానమిది..
జస్టిస్ లలిత్ 1957 నవంబర్ 9న జన్మించారు. 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1985 వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. 2014, ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ట్రిపుల్ తలాక్, కేరళలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ హక్కు వంటి కీలక కేసుల తీర్పులను జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనమే వెలువరించింది. బాంబే హైకోర్టులోని నాగ్పూర్ బెంచ్ ఇచ్చిన వివాదాస్పద స్కిన్-టూ-స్కిన్ టచ్ తీర్పును జస్టిస్ లలిత్ బెంచ్ తోసిపుచ్చింది. బార్ కౌన్సిల్ నుంచి సీజేఐ స్థాయికి చేరిన రెండో వ్యక్తిగా జస్టిస్ లలిత్ రికార్డులకెక్కారు. బార్ నుంచి అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నిలిచిన తొలివ్యక్తిగా 13వ సీజేఐ జస్టిస్ ఎస్ఎం సిక్రీ పేరిట రికార్డు ఉన్నది. ఒక న్యాయవాదిగా జస్టిస్ లలిత్ ఎన్నో ఉన్నతస్థాయి క్రిమినల్ కేసులు వాదించారు. 2011లో 2జీ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు జస్టిస్ లలిత్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది. జస్టిస్ లలిత్ తండ్రి యూఆర్ లలిత్ కూడా సీనియర్ న్యాయవాదే. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా ఆయన పనిచేశారు.
సీజేఐ ముందు కీలక కేసులు
సుప్రీంకోర్టు ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మరో 15 రోజుల్లో బాధ్యతల నుంచి వైదొలగనున్న తరుణంలో ఆయన బెంచ్ ముందు ఐదు కీలక కేసులు తుది దశలో ఉన్నాయి.