తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల పోస్టర్ను టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్. జవహర్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఆవిష్కరించారు. తిరుపతి పరిపాలన భవనంలోని ఈవో చాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది. మార్చి 11వ తేదీ నుంచి 21వ తేదీ దాకా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈవో జవహర్ రెడ్డి మాట్లాడుతూ..జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. 12వ తేదీ ధ్వజారోహణం, 16వ తేదీ గరుడోత్సవం, 19న రథోత్సవం, 20న చక్రస్నానం, 21వ తేదీ పుష్ప యాగం నిర్వహిస్తామన్నారు. టీటీడీ హిందూ ధార్మిక కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తోందన్నారు. ఎస్వీబీసీ ద్వారా ఈ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని చెప్పారు.