బంజారాహిల్స్, మార్చి 21: ఓట్ ఫర్ చేంజ్ నినాదంతో జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో బరిలో దిగిన జూబ్లీహిల్స్ వెల్ఫేర్ సొసైటీ(జేహెచ్డబ్ల్యూఎస్) ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మేనేజింగ్ కమిటీలో మొత్తం సీట్లను జేహెచ్డబ్ల్యూఎస్ ప్యానెల్ క్లీన్స్వీప్ సాధించింది. గత పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న జూబ్లీహిల్స్ టీమ్ ప్యానెల్కు ఒక్కసీటు రాలేదు. ఆదివారం జూబ్లీహిల్స్లోని భారతీయ విద్యాభవన్స్కూల్లో నిర్వహించిన పోలింగ్లో మొత్తం 3181మంది సభ్యులకు 1757మంది సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగిన ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2గంటలకు ముగిసింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సొసైటీ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నిర్మాతలు దిల్రాజు, కేఎస్.రామారావు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ వాణీదేవి సహా పెద్ద సంఖ్యలో ప్రముఖులు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ‘ఓట్ ఫర్ చేంజ్’ నినాదంలో బరిలోకి దిగిన జూబ్లీహిల్స్ వెల్ఫేర్ సొసైటీ (జేహెచ్డబ్ల్యూఎస్)ప్యానెల్ సభ్యులు స్పష్టమైన ఆధిక్యత కనబర్చారు. ఎస్సీ కేటగిరిలో జేహెచ్డబ్ల్యూఎస్ ప్యానెల్ తరఫున పోటీచేసిన మాజీ కేంద్రమంత్రి జేడీ.శీలం సతీమణి సుజాత శీలం విజయం సాధించారు. మహిళా కేటగిరిలోని రెండుసీట్లను కూడా జేహెచ్డబ్ల్యూఎస్ ప్యానెల్ దక్కించుకుంది. ఈ ప్యానెల్నుంచి పోటీచేసిన ఆదాల హిమబిందురెడ్డి, డి.సునీలారెడ్డి విజయం సాధించారు. వీరితో పాటు జనరల్ కేటగిరిలో ప్యానెల్ తరఫున పోటీచేసిన మొత్తం 12మంది సభ్యులు విజయం సాధించారు. ఎన్నికైన సభ్యులు ఒకటిరెండురోజుల్లో సమావేశమై సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శి సహా కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు.
జూబ్లీహిల్స్ సొసైటీ సభ్యులుగా గెలిచిన వారు వీరే
సుజాత శీలం
ఆదాల హిమబిందురెడ్డి
డి.సునీలారెడ్డి
ఎం.ఆనంద్కుమార్
డా.ఓమ్ ప్రకాశ్అగర్వాల్
కుసుమ్కుమార్ జెట్టి
గరికపాటి శ్రీనువాసులు
పి.నాగరాజు
కే.నాగేంద్రప్రసాద్
బి.రవీంద్రనాథ్
వీవీ.రాజేంద్రప్రసాద్
మాదాడి శ్రీలక్ష్మీరెడ్డి
ఆర్.మాధవ్రెడ్డి
ఏ.మురళీముకుంద్
ఎస్.సతీశ్చంద్రారెడ్డి