హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం ముగిసింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డు చైర్మన్ల ఆధ్వర్యంలో సమావేశం జరగ్గా.. ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీశైలం జల విద్యుత్ అంశంపై మరోసారి సమావేశంలో చర్చకు వచ్చింది. ఏపీ అధికారి శ్యామలారావు విద్యుత్ ఉత్పత్తి అంశాన్ని పూర్తి చేద్దామంటూ చర్చకు తీసుకువచ్చారు. అయితే, ఈ విషయంలో తెలంగాణ అభిప్రాయాన్ని స్పష్టం చేశామని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్కుమార్ స్పష్టం చేశారు. మళ్లీ చర్చ అంటే మరోసారి సమావేశానికి రామని చెప్పారు. ఈ సందర్భంగా సమావేశంలో ఆయన నిలబడే వాదనలు వినిపించారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల వినియోగం జరుగనుంది.
సమావేశం అనంతరం రజత్కుమార్ మాట్లాడుతూ కృష్ణా జలాల్లో 50శాతం వాటా కావాలని కోరినట్లు తెలిపారు. వాటాలు ఖరారు చేసే అధికారం లేదని కృష్ణా బోర్డు తెలిపిందని, 299, 512 టీఎంసీల చొప్పున నీటి వాటాలు కొనసాగుతాయన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించకుండా చూడాలని కోరామని, గెజిట్ నోటిఫికేషన్లోని అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని రజత్కుమార్ పేర్కొన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి ట్రైబ్యునల్ అనుమతులు ఉన్నాయని, వివరాలపై బోర్డు సానుకూలంగా స్పందించలేదని తెలిపారు. రెండు బోర్డులు పాత కేటాయింపులను కొనసాగించేందుకే మొగ్గు చూపాయని, విద్యుత్ విషయంలో బోర్డు వైఖరికి నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు చెప్పారు.
కాళేశ్వరం అదనపు టీఎంసీ, తుపాకులగూడెం, కంతనపల్లి ప్రాజెక్టుల డీపీఆర్లు బోర్డులకు ఇచ్చామని, పది ప్రాజెక్టులపై అవసరం లేదమన్నామని చెప్పారు. దేవాదుల, మొడికుంటవాగు, ఛనకా – కొరటా డీపీఆర్లు తయారవుతున్నాయని తెలిపారు. టెలిమెట్రీ విషయంలో కేఆర్ఎంబీ విఫలమైందన్నారు. బోర్డులు ఇతర సమస్యలను ఎలా పరిష్కరిస్తాయో చెప్పాలన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు పూర్తిస్థాయి కార్యాచరణ అవసరమని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయలో చెరువుల సామర్థ్యం ఎక్కడా పెంచలేదని చెప్పారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడుకు కేటాయింపులపై నిరసన తెలిపినట్లు వెల్లడించారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తామని తెలిపినట్లు చెప్పారు. గోదావరి జలాలకు బదులుగా కృష్ణా జలాలు తీసుకుంటామని, 45 టీఎంసీల కృష్ణా జలాలు అదనంగా తీసుకుంటామని బోర్డులకు తెలిపినట్లు వివరించారు.