హుజూరాబాద్: మీకు అందుబాటులో ఉండి, ఏ చిన్న సమస్య వచ్చిన ఫోన్ కొట్టిన క్షణాల్లో వచ్చి మీ ముందువాలుతా, నిరుపేద బిడ్డగా నన్ను ఆదరించి ఆశీర్వదించండి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని టీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ అన్నారు. సోమవారం హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డ్లోని దమ్మక్కపేట గ్రామంలో ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దమ్మకపేట గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు బరిగే గట్టయ్యయాదవ్, ఆయన భార్య బరిగే మాధవరాణిలు దాదాపు 200 మందితో గెల్లు శ్రీనివాస్యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారికి శ్రీనివాస్యాదవ్ గులాబీకండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం గెల్లు శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ… నేను 20ఏండ్లుగా తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి 134 కేసుల పాలై రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్ వెంటే ఉన్న బిడ్డగా తనను గుర్తించి సీఎం కేసీఆర్ టీక్కెట్ ఇచ్చాడన్నారు. వందల కోట్లు, వందల ఎకరాలు భూమి ఉన్న బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు, రెండు గుంటల భూమి ఉన్న పేద బిడ్డకు మధ్య ఈ పోటీ జరుగుతుందన్నారు.
మీ కళ్ళ ముందు కదలాడే బిడ్డగా నన్ను ఆదరించి అక్కున చేర్చుకొని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానని గెల్లు శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మెరుగు కొండల్రెడ్డి, కరీంనగర్ కార్పొరేటర్ జంగిలి సాగర్, టీఆర్ఎస్ నాయకులు అపరాధ మహేష్, కోడారి రాజు, సల్పాల రాజు యాదవ్, రాంపెల్లి హరీష్చారి, మునిగంటి రాకేష్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.