అమరావతి : ఏపీలో పీఆర్సీపై పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాలందరినీ అభినందిస్తున్నానని సీపీఐ నాయకుడు నారాయణ తెలిపారు. ఉద్యోగ సంఘాల ఆందోళనకు మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు. సమస్యల సాధనకు ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణను అభినందించారు. ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలకు అంటకాగాల్సిన అవసరం లేదని అదే సమయంలో అంటరాని తనంగా కూడా పరిగణించకూడదని ఉద్యోగ సంఘాల నాయకులకు సూచించారు.
ఉద్యోగులను ఎవరు స్వార్థంతో వినియోగించుకుంటున్నారో ఆలోచించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లపై మొండిగా వ్యవహరించరాదని సూచించారు. సమస్యను తెగేవరకు లాగకుండా సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. నిన్న ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజకీయ పార్టీలను ఉద్యమంలోకి అనుమతించకూడదని నిర్ణయించిన దరిమిలా నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.