హైదరాబాద్: పేరుతో పలకరించిన సైబర్ నేరగాళ్లు ఒకే రోజులో 7.20 లక్షలను కొట్టేశారు. తీరా మోసపోయానని బాధితురాలు రాచకొండ సైబర్కైం పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళను తన పేరుతో పలకరించి బురిడి కొట్టించిన వైనం ఇలా.. మౌలాలీ ప్రాంతానికి చెందిన బాధితురాలికి ఈ నెల 22న తన ఫోన్కు హై అంజనా అంటూ ఓ ఎసెమ్మెస్ వచ్చింది. అందులో అమెజాన్ సంస్థ అత్యవసరంగా పార్ట్-టైం ఉద్యోగాల కోసం ఎంపిక చేస్తుంది. దీంతో రోజుకు రూ.3 వేల నుంచి 10 వేల వరకు సంపాదించవచ్చని ఓ లింక్ను ఇచ్చారు. ఆ లింక్ను బాధితురాలు క్లిక్ చేయగా.. నేరుగా వాట్సాప్ గ్రూపులోకి వెళ్లింది. అక్కడ బాధితురాలు హై అని టైప్ చేసింది. రిప్లెగా ఫ్లిప్కార్ట్-మెయిల్ పేరుతో ఓ సమాచారం వచ్చింది. కేవలం స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ఉంటే మీరు టాస్క్ను పూర్తిచేసి చాలా డబ్బులు సంపాదించవచ్చని చెప్పి మరో లింక్ను ఇచ్చాడు. ఆ లింక్ను క్లిక్ చేసి అందులో బాధితురాలు రిజిస్టర్ అయ్యింది.
ఆ తర్వాత ఆమెను రూ.200 పెట్టుబడి పెట్టమన్నాడు. దీంతో ఫోన్పే నుంచి రేజర్ పేమెంట్ గేట్వే ద్వారా లింక్ పంపిన వ్యక్తికి పంపింది. వెంటనే ఆమె బ్యాంక్ ఖాతాకు రూ.400 వచ్చాయి. దీంతో నమ్మకం పెరిగి ఈ నెల 24న బాధితురాలు ఒకే రోజులో దాదాపు 7.20 లక్షలను పెట్టుబడిగా పెట్టింది. లాభం డబ్బు ఆమెకు కనిపిస్తుంది. కానీ విత్డ్రా చేసుకోవడానికి రావడంలేదు. మోసపోయానని బాధితురాలు సైబర్ కైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పేరుతో పలకరించే సమాచారం వచ్చినప్పుడు అవి నిజమైనవిగా నమ్మకండి ఎందుకంటే సైబర్ నేరగాళ్లు మన ఫోన్ నంబర్లను పలు ఏజెంట్ల ద్వారా కొనుగొలు చేసి ఈ విధంగా మోసానికి పాల్పడతారని సైబర్కైం అధికారులు హెచ్చరిస్తున్నారు.