శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. గడిచిన మూడు రోజుల్లో రెండు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమై కీలక నిర్ణయం తీసుకున్నది. కశ్మీరీ హిందు, మైనారిటీ కమ్యూనిటీ ఉద్యోగులందరినీ సురక్షిత ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వాలని ఎల్జీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా జిల్లాల కేంద్రాలకు తరలించనున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో తరలింపు ప్రక్రియ ఈ నెల 6 వరకు పూర్తి కానున్నది. అదే సమయంలో ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేయనున్నారు.
ఇందులో భాగంగా ఈ-మెయిల్ ద్వారా సైతం ఫిర్యాదులు పంపొచ్చు. సత్వరం సకాలంలో సమస్యలను పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు హెచ్చరించారు. కశ్మీర్ లోయలో పీఎం ప్యాకేజీ, మైనారిటీ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఎల్జీ కఠిన ఆదేశాలు జారీ చేశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యత ఆధారంగా తీసుకోనున్నారు. ఎల్జీ సెక్రటేరియట్ ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ను ఏర్పాటు చేస్తుంది. ఫిర్యాదుల పరిష్కారం కోసం సాధారణ పరిపాలన విభాగం ఫిర్యాదులు చేయగల ప్రత్యేక ఇ-మెయిల్ చిరునామాను జారీ చేస్తుంది. మైనారిటీ ఉద్యోగుల కోసం సెల్ ది కాశ్మీర్లోని మైనారిటీ ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసింది.
మైనారిటీ కమ్యూనిటీ ప్రజలు jk.minoritycell@gmail.com లేదంటే 0194-2506111, 2506112 నంబర్కు ఫోన్ చేసి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు అధికారులు పరీక్షించనున్నారు. ఇదిలా ఉండగా.. లోయలో ఉద్యోగుల భద్రత, వసతికి సంబంధించి ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఉద్యోగులకు నివాసాలను సురక్షిత ప్రదేశాల్లో ఉండేలా చూడనున్నారు. వసతికి ఇండ్లను కేటాయించే సమయంలో అక్కడ ఒకటే లేకుండా చూడనున్నారు. అలాగే ప్రధానమంత్రి ప్యాకేజీలో పని చేస్తున్న కశ్మీరీ పండిట్ల ప్రమోషన్, సీనియారిటీ జాబితా, డిపార్ట్మెంటర్ ప్రమోషన్స్ జాబితా మూడు వారాల్లో సిద్ధం కానున్నాయి.