Jharkhand Crisis | జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ రమేశ్ బియాస్ శుక్రవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్పై అనర్హత విషయమై నిర్ణయం తీసుకోవాలని ఈసీ చేసిన సిఫారసు వార్తలపై స్పష్టత ఇవ్వాలని గురువారం అధికార యూపీఏ ఎమ్మెల్యేలు గవర్నర్ను కోరారు. ఆ మరునాడే గవర్నర్ రమేశ్ బియాస్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం మరింత అనుమానాలకు తావిస్తున్నది. త్వరలో సందేహాలన్నీ నివృత్తి చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే రాజ్భవన్ వర్గాలు మాత్రం.. వైద్య పరీక్షల కోసమే గవర్నర్ రమేశ్ బియాస్ ఢిల్లీకి వెళ్లారని, ఇది ఆయన వ్యక్తిగత పర్యటన అని చెప్పాయి.
లాభదాయక పోస్ట్ను కలిగి ఉన్నారన్న అభియోగంపై హేమంత్ సోరెన్పై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్కు గత నెల 25న ఈసీ సమాచారం ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. నాటి నుంచి జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. ఈసీ తన నిర్ణయాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. కానీ, సీఎం హేమంత్ సోరెన్పై అనర్హత వేటు వేయాలని గవర్నర్కు ఈసీ సిఫారసు చేసిందని సమాచారం.
రాష్ట్రంలో రాజకీయ బేరసారాలను ప్రోత్సహించేందుకు గవర్నర్ బియాస్ ప్రయత్నిస్తున్నారని యూపీఏ భాగస్వామ్య పక్షాలు గత నెల 28న సంయుక్త ప్రకటనలో విమర్శించాయి. అందుకే ఈసీ సిఫారసుపై నిర్ణయాన్ని వెల్లడించడంలో జాప్యం చేస్తున్నారని పేర్కొన్నాయి. మహారాష్ట్రలో మాదిరిగానే తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అనుమానిస్తున్నది. అందుకోసం తమ ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నదని భావిస్తున్నారు.