-టీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్
-పార్టీ నిర్ణయాలు నచ్చకనే అధికార పార్టీలో చేరిన: కౌన్సిలర్ నవీన్
-ఐదుకు చేరిన ఆ పార్టీ బలం, మరో ఇద్దరు వచ్చే చాన్స్..
-డైలామాలో మున్సిపాలిటీ పాలకవర్గం
మణికొండ : నగర శివారులోని మణికొండ మున్సిపాలిటీలో బీజేపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రజాసమస్యలపై స్పందించకపోవడం, పార్టీ అధిష్టానం ఒత్తిడి, ఒంటెద్దు పోకడ నిర్ణయాలను జీర్ణించుకోలేని ఆ పార్టీ కౌన్సిలర్ సోమవారం అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత కొన్నాళ్లుగా బీజేపీ పార్టీ ప్రజాసమస్యలను విస్మరిస్తుండటం నచ్చకనే బీజేపీకి రాజీనామా చేసి తన అనుచరులతో టీఆర్ ఎస్ లో చేరినట్టు కౌన్సిలర్ ఆలస్యం నవీన్కుమార్ తెలిపారు.
సోమవారం స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ సమక్షంలో మైలార్దేవ్పల్లిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద సుమారు 200 మంది కార్యకర్తలతో కలిసి ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కౌన్సిలర్ నవీన్కుమార్,యువతకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రజాసంక్షేమం, అభివృద్ది అనే మాటలకు పూర్తిస్థాయి నిర్వచనం ఇచ్చిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. ప్రజలకు సంపూర్ణమైన అభివృద్దితో పాటు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనను అందిస్తున్నారన్నారు. ఇప్పటికే దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. ప్రజాసంక్షేమం కోసం పాటుపడే ప్రతి నాయకుడు గులాబీజెండా కిందకు వస్తారన్నారు.
మణికొండ మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్ ఆలస్యం నవీన్కుమార్ ప్రజాసంక్షేమాన్ని ఆకాంక్షించి అధికార పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. అనునిత్యం ప్రజాక్షేత్రంలో పనిచేసేవారికి పార్టీ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. యువత ముందుండి మణికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు కృషిచేయాలని కోరారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ ఆలస్యం నవీన్కుమార్ మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలంటే అధికార పార్టీ మద్దతు ఉంటే మరింతగా నా వార్డును అభివృద్ది పర్చవచ్చునని అన్నారు. అందుకే బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశానని బీజేపీలో కొంతమంది నాయకుల ఒత్తిడికి లోబడి పనిచేయాలని హుకూం జారీచేస్తున్నారని, వారి విధానాలు నచ్చలేదన్నారు.
మరికొంతమంది బీజేపీ కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖంగా ఉన్నారని త్వరలోనే వచ్చే అవకాశాలున్నా యన్నారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ కె.రామకృష్ణారెడ్డి, నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ రేఖయాదగిరి, మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు బి.సాయిరెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బి.శ్రీరాములు, కౌన్సిలర్లు కావ్య, వసంత్హాన్, పి.శైలజ, నాయకులు నీలేష్ ప్రసాద్ దూబే, ప్రమోద్రెడ్డి, జయరాజ్, బషీర్, నాయుడు, కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీల కౌన్సిలర్ల చూపు టీఆర్ఎస్ వైపు
మణికొండ మున్సిపాలిటీలో అనైతికంగా పొత్తును ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్,బీజేపీ పార్టీల కౌన్సిలర్లు కొంతమంది అధికార పార్టీలో చేరేందుకు సముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎక్కడ పొసగకున్నా అధికార దాహాం కోసం ఇరుపార్టీలు అనైతికంగా పొత్తు పెట్టుకుని మణికొండ మున్సిపాలిటీ లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నాయి. అప్పట్నుంచి మద్దతు తెలిపిన బీజేపీ, కొంతమంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను చైర్మన్, వైస్ చైర్మన్లు పట్టించుకోకుండా వదిలివేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రజాసమస్యలపై అంతగా దృష్టిసారించకపోవడంతో స్థానికంగా వ్యతిరేకత మొదలైనట్టు తెలిసింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు, బీజేపీ నుంచి మరో ఇద్దరు కౌన్సిలర్లు అధికార పార్టీలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఆ పార్టీలకు చెందిన నాయకులే చెబుతున్నారు. ఏదేమైనా వచ్చే రోజుల్లో అనైతిక పొత్తు తాత్కాలికమే అన్నట్లు ప్రచారం జరుగుతుంది.