చండీఘడ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయంతో ఆప్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివెరిశాయి. పలు రాష్ట్రాల్లో ఆప్ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుని పార్టీ విజయాన్ని వేడుకలా జరుపుకున్నారు. పంజాబ్ పోరులో అమృత్సర్ ఈస్ట్ నుంచి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్ నేత మజితియాను మట్టికరిపించిన ఆప్ అభ్యర్ధి జీవన్జోత్ కౌర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
పంజాబ్లో ఆప్ ఘనవిజయం పంజాబీల విజయంగా ఆమె అభివర్ణించారు. డిసెంబర్ 3న తనకు పార్టీ అభ్యర్ధిత్వం ఖరారైందని, తాను చేపట్టిన ఇంటింటి ప్రచారానికి అద్భుత స్పందన కనిపించిందని చెప్పుకొచ్చారు. ఉనికి కోసం నడిపే రాజకీయాలకు ఆప్ గెలుపుతో పంజాబ్లో కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు.
ఇక 117 స్ధానాలున్న పంజాబ్లో ఆప్ ఏకంగా 92 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ కేవలం 18 స్ధానాల్లో ముందంజలో ఉంది. శిరోమణి అకాలీదళ్ 4 స్ధానాల్లో, బీజేపీ 2 స్ధానాల్లో ఇతరులు 1 స్ధానంలో ముందంజలో ఉన్నారు.