హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : జేఈఈ, నీట్ దేశంలోనే అత్యున్నత ప్రవేశ పరీక్షలు. ఈ పరీక్షలకు సన్నద్ధం కావడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, కోచింగ్కు వెళ్లలేని వారికోసం ఐఐటీ పాలక్కడ్ సహా మరికొన్ని ఐఐటీలు.. జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల డిజిటల్ పాఠాలను రూపొందించాయి.
పలువురు నిపుణులు, ప్రొఫెసర్లతో ఈ వీడియో పాఠాలను తీసుకొచ్చారు. ఆయా వీడియో పాఠాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తన వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చింది. ఆసక్తి ఉన్న వారు ఎన్టీఏ వెబ్సైట్లో ‘కంటెంట్ బేస్డ్ లెక్చర్స్’ పై క్లిక్చేయడం ద్వారా కావాల్సిన సబ్జెక్టును ఎంపికచేసుకొని డిజిటల్ పాఠాలను ఆస్వాదించవచ్చు. ఈ పాఠాల నుంచే ప్రశ్నలు కచ్చితంగా వస్తాయని చెప్పలేమని, అయితే, వీటిని వినడం ద్వారా విషయ అవగాహన పెరుగుతుందని ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి.