అనంతపురం: తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి మౌనదీక్ష చేపట్టారు. పీఎస్ ఎదుట కుర్చీ వేసుకుని కూర్చుండి ఆయన మౌనదీక్షకు దిగారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు మద్దతుగా దీక్షలో కూర్చుకున్నారు. డీఎస్పీకి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో జేసీ తన దీక్షను విరమించారు. తాడిపత్రిలో జేసీ మౌనదీక్షతో వాతావరణం వేడెక్కింది.
వైసీపీ నేతల దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలం చెందారంటూ ఆరోపిస్తూ జేసీ ప్రభాకర్రెడ్డి మౌనదీక్షకు దిగారు. తాడిపత్రిలో తమకు రక్షణ లేకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుటై బైఠాయించారు. తమ కార్యకర్తలను వైసీపీ నాయకులు దాడి చేసి కొట్టినా డీఎస్పీ వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. జేసీకి మద్ధతుగా పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. స్థానిక డీఎస్పీ చైతన్య కారణంగానే తాడిపత్రిలో వైసీపీ గుండాలు రెచ్చిపోతున్నారని నినాదాలు చేశారు.
టీడీపీ నాయకులపై జరిగిన దాడులపై ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారని పోలీసు అధికారులను జేసీ ప్రశ్నించారు. ఇంకా ఎంతకాలం మీరు చెప్పినట్లుగా శాంతిగా ఉండాలన్నారు. మీ మాటలు విని శాంతంగా ఉండటం వల్ల నిన్న మా కార్పొరేటర్పై వైసీపీ నేతలు దాడులు చేశారని, వారిపై ఏం చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని జేసీ డిమాండ్ చేశారు. పోలీసులే ఈ దాడి చేయించినట్లు కనిపిస్తున్నదని ఆయన ఆరోపించారు. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో జేసీ తన మౌనదీక్షను విరమించారు.