తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు చాలా పెరిగింది. బాలీవుడ్ కూడా కుళ్ళుకునేలా మన సినిమాలు కమర్షియల్ గా వసూలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్యాండమిక్ తర్వాత తెలుగు ఇండస్ట్రీ కోలుకున్న తీరు చూసి మిగిలిన ఇండస్ట్రీలు కుళ్ళుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మొన్న విడుదలైన జాతి రత్నాలు సినిమా నేషనల్ వైడ్ గా రికార్డు సృష్టించింది. ఇండియాలో మరే సినిమాకు సాధ్యంకాని స్థాయిలో కరోనా తర్వాత రికార్డులు తిరగరాసింది ఈ సినిమా. 17 రోజుల్లో 38 కోట్ల షేర్ వసూలు చేసింది. డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 27 కోట్ల లాభాలు తీసుకొచ్చింది జాతిరత్నాలు. నిర్మాతలకు దాదాపు 40 కోట్ల లాభాలు మిగిల్చింది ఈ సినిమా.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఒక నేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. అది ఓవర్సీస్ లో 1 మిలియన్ క్రాస్ చేయడం. నిజానికి ఇది పెద్ద రికార్డు కాదు కానీ పాండమిక్ తర్వాత మన సినిమాలు విదేశీ మార్కెట్లో విడుదల కావడమే ఘనంగా మారిపోయింది. అలాంటి సమయంలో అక్కడ విడుదలై విజయం సాధించడం అనేది కలగా మిగిలిపోయింది. బాలీవుడ్ సినిమాలు కూడా కనీస వసూళ్లు సాధించలేకపోయాయి. ఇక ఈ ఏడాది మన దగ్గర సంచలన విజయం సాధించిన క్రాక్, మాస్టర్, ఉప్పెన అలాంటి సినిమాలు కూడా ఓవర్సీస్ లో చేతులెత్తేశాయి.
ఇలాంటి సమయంలో విడుదలైన జాతి రత్నాలు ఓవర్సీస్ లో 1 మిలియన్ వసూలు చేసింది. దాంతో తెలుగు సినిమాకే కాదు ఇండియన్ సినిమాకు కూడా అక్కడ మళ్లీ హోప్స్ క్రియేట్ చేసింది. అనుదీప్ తెరకెక్కించిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం ఈ సినిమాలో నవ్వించాడు. ఏదేమైనా కూడా జాతిరత్నాలు మిలియన్ క్రాస్ చేయడంతో మిగిలిన దర్శక నిర్మాతలు పండగ చేసుకుంటున్నారు.