‘పోలీసులు, చట్టాల పట్ల ఎలాంటి అవగాహన లేని ముగ్గురు అమాయక యువకుల కథ ఇది. ఓ పెద్ద నేరంలో చిక్కుకున్న వారు ఏ విధంగా బయటపడ్డారనే కథాంశంతో వినోదాన్ని పంచుతుంది’ అని అన్నారు అనుదీప్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘జాతిరత్నాలు’. నాగ్ అశ్విన్ నిర్మాత. ఈ నెల 11న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో అనుదీప్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘నా స్వస్థలం సంగారెడ్డి. అమీర్పేట్లో డిగ్రీ చేశాను. పదేళ్ల క్రితం లఘు చిత్రాలతో నా ప్రయాణం ఆరంభమైంది. సమకాలీన అంశాలతో సాగే సెటైరికల్ ఎంటర్టైనర్గా ‘జాతిరత్నాలు’ చిత్రాన్ని తెరకెక్కించాం. సమాజంలో చోటుచేసుకుంటున్న వాస్తవాల్ని సీరియస్గా కాకుండా కామెడీ జోడించి ఈ సినిమాలో చెప్పాం. జాతిరత్నాలుగా పిలవబడే ముగ్గురు యువకులు చేసే ప్రతి పని నుంచి బోలెడంత కామెడీ పుడుతుంది.
నవీన్, రాహుల్రామకృష్ణ, ప్రియదర్శితో పాటు ప్రతి పాత్రకు సమ ప్రాధాన్యముంటుంది. నేను చేసిన ఓ షార్ట్ఫిల్మ్ నచ్చడంతో నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం నన్ను సంప్రదించారు. నాగ్ అశ్విన్లో ఎలాంటి భేషజాలు ఉండవు. నేను చెప్పింది పాటించాలనే ఒత్తిడిని తీసుకురాకుండా సినిమా రూపకల్పనలో అవసరమైన చక్కటి సలహాలిచ్చారు. దర్శకుడిగా ‘పిట్టగోడ’ నా మొదటి సినిమా. అనుకున్నంతగా ఆ సినిమా ఆడలేదు. మార్షల్ ఆర్ట్స్కు వినోదాన్ని జోడిస్తూ తదుపరి కథ రాసుకున్నా. వైజయంతీ మూవీస్లో ఆ సినిమా చేయబోతున్నా’ అని తెలిపారు.