నెలరోజుల్లో చేతికి పంట
పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ
పట్టుపరిశ్రమపై రైతుల ఆసక్తి
వందశాతం సబ్సిడీతో దినదినాభివృద్ధి
రైతులకు లాభాల ‘పట్టు’ దొరికేందుకు మల్బరీసాగుతో పట్టు పురుగుల పెంపకం ఎంతగానో దోహదపడుతున్నది. ఒకే విధమైన పంటలు కాకుండా ఆసక్తి ఉన్నవారు పట్టు పరిశ్రమ వైపు మళ్లితే మంచి ఆదాయమార్గంగా ఉండనుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితోనే ప్రతినెలా పంట చేతికందుతుంది. ప్రభుత్వం కూడా 100శాతం సబ్సిడీలు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నది.
ఎల్కతుర్తి, మార్చి 25 లాభసాటిగా ఉంది
గతంలో పత్తి, వరి, మక్క పంటలు పండించేటోళ్లం. సంవత్సరానికి ఒక పంట మాత్రమే వచ్చేది. పెట్టుబడు లు పోను ఏమీ మిగలకపోయేది. కానీ పట్టు సాగు చేసినప్పటి నుంచి మంచి ఆదాయం వస్తున్నది. ఏడాదికి 8 పంటలు తీస్తున్నం. ఇదివరకు కిలోకు రూ.75 చొప్పున ఇన్సెంటివ్ ఇచ్చే వారు. మళ్లీ ఇస్తే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.
సామల జమున, పట్టు సాగు రైతు,పెంచికల్పేట సర్పంచ్ ఆదాయ పంట
ఇతర పంటలతో పోలిస్తే పట్టు చాలా లాభసాటిగా ఉంది. ఇదివరకు సంప్రదాయ పంటలు వేసి దిగుబడులు రాక చాలా నష్టపోయా. పట్టు సాగు గురించి తెలిసి ఇటువైపు వచ్చా. కూలీల ఖర్చు తగ్గడమే కాకుండా తక్కువ నీళ్లు, తక్కువ పెట్టుబడులతోనే పంట తీస్తున్నా. గతంలో మాదిరి కిలోకు రూ.75 ఇన్సెంటివ్ ఇవ్వాలి.
మర్రి రాజయ్య, రైతు30 ఏండ్ల క్రితమే పునాది
ఎల్కతుర్తి పూర్తిగా మెట్టప్రాతం. ఇక్కడి చుట్టుపక్కల మండలాల పరిధిలో పట్టు పరిశ్రమను రైతులకు ప్రత్యామ్నాయ పంటగా మార్చేందుకు అప్పటి ప్రభుత్వాలు ఇక్కడి రైతులను పట్టు పురుగుల పెంపకం దిశగా ప్రోత్సహిం చాయి. ఎల్కతుర్తి మండలకేంద్రం లో రైతులకు అనువుగా ఉండేందుకు 1992లో ఎన్ఎస్పీ (నేషనల్ సెరికల్చర్ ప్రాజెక్టు) కింద 25లక్షల పట్టు కండెలు నిల్వ చేసే సామర్థ్యం కలిగిన సెరికల్చర్ భవనం కూడా నిర్మించారు. ప్రస్తుతం ఎల్కతుర్తి క్లస్టర్ పరిధిలో కమలాపూర్, ఎల్కతు ర్తి, హసన్పర్తి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 47మంది రైతులు సుమారు 90 ఎకరాల్లో మల్బరీని సాగుచేస్తూ పట్టు పురుగుల పెంపకం చేపట్టారు.
100శాతం సబ్సిడీ
పట్టు పరిశ్రమను ప్రోత్సహించేందుకుగాను ప్రభుత్వం ఆర్కేవీవై(రాష్ట్రీయ కృషి వికాస్ యోజన) కింద రైతులకు 100శాతం సబ్సిడీపై యంత్రాలు, ఇతర పనిముట్లను సమకూర్చుతుంది. ఇందులో భాగంగా సుమారు రెండు ఎకరాలు ఉన్న రైతుకు ఒక యూనిట్ ఆధారంగా షెడ్డు నిర్మాణం కోసం రూ.2లక్షలు, మల్బరీ తోట పెంపకానికి రూ.32,500, స్టాండ్ల కోసం రూ.15వేలు, రోగ నిరోధక మందుల కోసం రూ.2500, మల్బరీ తోట నిర్వహణ కోసం రూ.36వేలతో పాటు నేత్రికలు, ట్రేలను కూడా పూర్తి సబ్సిడీపై అందిస్తున్నది.
నెలకో పంట
మిగతా పంటల్లా కాకుండా పట్టు నెల రోజులకే చేతికందుతుంది. చవ్కి రేరింగ్ సెంటర్ల ద్వారా నేరుగా పట్టు పురుగులు కొనుగోలు చేసి పెంచితే మరో పది రోజుల ముందే పంట వస్తుంది. ప్రస్తుతం ఈ చాకి రేరింగ్ కేంద్రాలు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, వర్ధన్నపేట దగ్గరలోని ల్యాబర్తి, నల్గొండ జిల్లాలోని శిల్పి దగ్గర నుంచి సరఫరా చేస్తున్నారు. మరికొందరు రైతులు గుడ్లనే కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా అయితే పంట నెలరోజల్లో వస్తుంది. 100 గుడ్లకు 60-70 కిలోల మధ్య యావరేజ్గా పంట వస్తుంది. సుమారు 300 గుడ్లను ఒక పంటకు వేసుకుంటే రెండు క్వింటాళ్ల పట్టు వస్తుంది. ప్రస్తుతం కిలో పట్టుకు మార్కెట్లో రూ. 300-400 వరకు ధర పలుకుతున్నది. తద్వారా ఒక్కో పంటకు రూ.20వేల వరకు పెట్టుబడి పోను రూ.50వేల వరకు లాభం వస్తుంది. ఒక్కో రైతు సంవత్సరంలో 7 నుంచి 8 పంటలు తీస్తాడు. దీనివల్ల రైతుకు సంవత్సరానికి సుమారు రూ.4లక్షల ఆదాయం వస్తుంది. రైతుల సౌకర్యం కోసం అధికారులు జనగామ, సికింద్రాబాద్ దగ్గరలోని తిరుమలగిరిలో పట్టు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పురుగులకు హాని కలుగకుండా రసాయనాలు లేకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే మల్బరీని పండిస్తారు. ఏదేమైనా ఇతర పంటలతో పోలిస్తే పట్టు సాగులో అధిక లాభాలు వస్తుండడంతో రైతులు ఇటు వైపు దృష్టి సారిస్తున్నారు.