రేపటి నుంచి అందుబాటులోకి డయాగ్నస్టిక్ సెంటర్లు
ఇక్కడ 57 రకాల పరీక్షలు ఉచితం
ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
హన్మకొండ, జూన్ 5 : పేదలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 19 జిల్లాకేంద్రాల్లో ఎంపిక చేసిన 19 ప్రభుత్వ దవాఖానల్లో ఈ నెల 7న డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటుకానున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లోని దవాఖానల్లో డయాగ్నొస్టిక్ సెంటర్ల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖలో విప్లవాత్మకమైన మార్పులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ప్రభుత్వ దవాఖానల్లో ప్రభుత్వం మౌలి వసతులు మెరుగుపడ్డాయని తెలిపారు.
కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స కోసం అవసరమైన ఇతర పరీక్షలకు కూడా పేదలు అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో వైద్యం అందించడం అంటే కేవలం డాక్టర్లు, ఔషధలు మాత్రమే కాదని, పరీక్షలు కూడా అత్యంత ప్రాధాన్యతా అంశంగా భావించిందని చెప్పారు. అందులో భాగంగానే తక్షణమే 19 జిల్లాకేంద్రాల్లో డయాగ్నస్టిక్ కేంద్రాలు ప్రారంభించాలని సీఎం నిర్ణయించారన్నారు. గత పాలకుల హయాంలో ఆగమైన వైద్యరంగానికి అనతికాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూపం తీసుకొచ్చిందని మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న డయాగ్నస్టిక్ కేంద్రాల్లో 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. సాధారణ పరీక్షలు కాకుండా అత్యంత అరుదుగా చేసే ఖరీదైన టెస్టులు కూడా ఉచితంగా చేసి వెంటనే రిపోర్టులు ఇస్తారని వివరించారు. నిర్ధారించిన రిపోర్టులు ఆయా రోగుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ రూపంలో పంపే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం దృష్ట్యా ఏర్పాటుచేసిన ప్రభుత్వ దవాఖానల్లోని డయాగ్నస్టిక్ కేంద్రాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు.