విజయవాడ: జనసేన పార్టీని పటిష్ఠపరిచేందుకు ఆ పార్టీ అధినేత చర్యలు మొదలెట్టారు. అందుకు రెండో దఫా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నెల 21 నుంచి క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కార్యకర్తలకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు జనసైనికులు, వీర మహిళలను ఉద్దేశించి వీడియోను పవన్ కల్యాణ్ విడుదల చేశారు. జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని ఆ వీడియోలో పిలుపునిచ్చారు.
తొలి దఫా సభ్యత్వ నమోదును 2020 సెప్టెంబర్ నెలలో చేపట్టారు. అప్పుడు దాదాపు లక్ష మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 వేల మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకునేలా చూడనున్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ సభ్యత్వ నమోదు ఉపయోగపడుతుందని పవన్ కల్యాణ్ నమ్ముతున్నారు. గతంలో జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం కల్పించామని, లక్ష మందికి బీమా సౌకర్యం వర్తింపజేసి చనిపోయిన కార్యకర్తలకు అండగా నిలిచామని తెలిపారు.
ఇప్పటివరకు ప్రమాదాల్లో చనిపోయిన 23 మంది జనసైనికుల కుటుంబాలకు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బీమా చెక్కులు అందించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. మన కోసం, పార్టీ కోసం తపన పడ్డ వ్యక్తులు, కుటుంబాలకు అండగా ఉండాలని ఈ బీమా సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.