నల్లగొండ : హాలియాలో శనివారం జరిగిన కాంగ్రెస్ సభలో జానారెడ్డి అసహనం, ఆగం ఆగం అవడం చూస్తుంటే ఆయనకు ఓటమి భయం పట్టుకుందని మిర్యాలగూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, నిడమనూరు మండల ప్రచార ఇంఛార్జీ నల్లమోతు భాస్కర్రావు అన్నారు. నిన్నటి కాంగ్రెస్ సభపై మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శనివారం హాలియా సభ పెట్టి జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అడ్డగోలుగా ఆరోపణలు చేశారన్నారు.
సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్న కోమటిరెడ్డిని నల్లగొండ ప్రజలు ఇప్పటికే తరిమికొట్టిన విషయాన్ని గుర్తెరగాలన్నారు. భువనగిరికి పారిపోయి చావు తప్పి లొట్టబోయి ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి కింద మీద ఆగడం లేదన్నారు. కోమటిరెడ్డి సోదరులే నిజమైన బ్రోకర్లన్నారు. కోమటిరెడ్డి అన్నదమ్ములు నల్లగొండ జిల్లాలో రాజకీయాలను భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. జానారెడ్డికి మరోసారి భంగపాటు తప్పదన్నారు. లేని గొప్పలు చెప్పుకుంటూ ప్రజల్లో మరింత చులకన అవుతున్నారన్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ఆదివారం నిడమనూరు మండలం రాజన్నగూడెం గ్రామంలో పర్యటించారు. స్థానిక నేతలతో కలిసి గడపగడపకు తిరుగుతూ గ్రామాభివృద్ధి కోసం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ముప్పారం గ్రామంలో జరిగిన వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో కలిసి పాల్గొన్నారు.