చండీగఢ్ : జలాలాబాద్ బైక్ పేలుడు తీవ్రవాద్ర చర్యగా పంజాబ్ పోలీసులు అభివర్ణించారు. కేసుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు ఫవీల్కా జిల్లా ధర్ముపుర గ్రామానికి చెందిన పర్వీన్కుమార్గా గుర్తించినట్లు చెప్పారు. ఈ గ్రామం భారత్ – పాక్ సరిహద్దుకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉందని పోలీసులు తెలిపారు. ఈ నెల 15న ఫజిల్కాలోని జలాలాబాద్లో మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంక్ పేలి బల్వీందర్ సింగ్ (22) అనే యువకుడు మరణించిన విషయం తెలిసిందే. విచారణలో రద్దీగా ఉండే ప్రాంతంలో మోటార్ సైకిల్ను పేల్చేందుకు కుట్ర పన్నిన పర్వీన్ కుమార్ పాత్ర వెలుగులోకి వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
కుమార్ పాత్రపై వివరాలు తెలుసుకున్న తర్వాత.. అందుబాటులో ఉన్న ఆధారంగా ఫజిల్క పోలీసులు పోలీసులు విచారణ చేపట్టారు. శనివారం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఫిరోజ్పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) జతిందర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. విచారణలో బల్వీందర్ నడిపిన బైక్ జలాలాబాద్ నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో పార్క్ చేయాల్సి ఉందని కుమార్ చెప్పాడని పేర్కొన్నారు. ఈ నెల 14న ఫిరోజ్పూర్ చండీవాలా గ్రామానికి చెందిన సుఖ్వీందర్ సింగ్ అలియాస్ సుఖ ఇంట్లో ఈ ‘టెర్రర్ యాక్ట్’ కోసం ప్లాన్ చేసినట్లు కుమార్ వెల్లడించాడని ఐజీపీ చెప్పారు. మమ్దోత్లోని లఖ్మీర్ కే హిత్తర్ గ్రామానికి చెందిన గుర్ప్రీత్ సింగ్ సైతం ఈ ప్లాన్లో భాగమని తెలిపారు.
పోలీసులు సేకరించిన సమాచారం ఆధారంగా బల్వీందర్ సహా నలుగురు నిందితులపై కేసు నమోదు చేశామని, సుఖ్వీందర్, గుర్ప్రీత్లను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. నలుగురు నిందితులకు నేర నేపథ్యం ఉందని పేర్కొన్నారు. ఓ రైతు సమాచారం మేరకు నిందితుడు కుమార్ పొలాల్లో దాచిన టిఫిన్ బాంబును సైతం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఆగస్ట్ 8న అమృత్సర్ రూరల్ పోలీసులు లోపాక్లోని దలేకే గ్రామం నుంచి ఐదు హ్యాండ్ గ్రనేడ్లు, టిఫిన్ బాంబును స్వాధీనం చేసుకున్నారు. ఆగస్ట్ 20న కపుర్తల పోలీసులు ఫగ్వారా నుంచి రెండు హ్యాండ్ బాంబ్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని, ఆగస్ట్ 8న అజాల్నాలో ఆయిల్ ట్యాంకర్ను పేల్చేందుకు మరో టిఫిన్ బాంబు వినియోగించారని వివరించారు.