కాబూల్: నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ (Maulana Masood Azhar ) పాకిస్థాన్లో ఉన్నాడని అఫ్గానిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. అజర్ అఫ్గాన్లో ఉన్నాడన్న పాక్ ఆరోపణలను ఆ దేశ విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. మౌలానా అఫ్గాన్లోని నంగర్హర్, కన్హర్ ప్రాంతాల్లో తలదాచుకున్నాడని, అతడిని వెంటనే అరెస్టు చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం తాలిబన్ల నేత్వంలోని అఫ్గాన్ సర్కార్కు లేఖ రాసింది. దీనిని తాలిబన్లు ఖండించారు. అతడు పాక్లోనే ఉన్నాడని, ఇలాంటి ఆరోపణలు మరోసారి చేస్తే ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుందని తాలిబన్ ప్రతినిధి అబ్దుల్ బల్ఖీ హెచ్చరించారు. మౌలానా తమ దేశంలోనే ఉన్నాడనడానికి సరైనా ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు.
కాగా, ఐక్యరాజ్య సమితిచేత అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తింపు పొందినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఫైనాన్షియల్ ఆక్షన్ టాస్క్ఫోర్స్ పాకిస్థాన్కు స్పష్టం చేసింది. అలా చేసినప్పుడే గ్రే లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మసూద్ తమ దేశంలో లేడని చెప్పేందుకు.. అతడు అఫ్గాన్లో ఉన్నాడని, అక్కడి ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని లేఖరాసింది.