తొలి త్రైమాసికంలో 2,306 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి
88శాతం పీఎల్ఎఫ్తో దేశంలోనే నంబర్ వన్ ఘనత
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం ఉత్పత్తిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆల్టైమ్ రికార్డును నెలకొల్పింది. తొలి త్రైమాసికంలోనే 2,306 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. సగటున 88 శాతం పీఎల్ఎఫ్ సాధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్తు కేంద్రాల జాబితాలో ఈ ప్లాంట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
ఈ ఘనతపై సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ హర్షం వ్యక్తంచేశారు. బుధవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి థర్మల్, సోలార్ పవర్ ప్లాంట్ల పనితీరుపై ఆయన సమీక్షించారు. ఈ వేసవిలో విద్యుత్తు వినియోగం గరిష్ఠ స్థాయికి చేరిన నేపథ్యంలో సింగరేణి విద్యుత్తు కేంద్రం 88 శాతం పీఎల్ఎఫ్తో రాష్ట్ర అవసరాలను తీర్చిందని అన్నారు.