జగిత్యాల కలెక్టరేట్, ఆగస్టు 23 : ఆర్టీసీ బస్టాండ్ల వద్ద మాటు వేస్తారు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తారు. ఆ మహిళలు ఎక్కిన బస్లోనే ఎక్కుతారు. మాటలు కలిపి చాకచక్యంగా బ్యాగులు, మెడల్లోంచి బంగారు నగలు మాయం చేస్తారు. పని పూర్తికాగానే బస్ దిగుతారు. బస్ వెనకాలే వచ్చే కారులో ఎక్కి మిగతా ముఠా సభ్యులతో కలిసి ఉడాయిస్తారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 29 తులాల బంగారు, 78 తులాల వెండి నగలను దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు రంగంలోకి దిగి, ఐదుగురు సభ్యుల ముఠా గుట్టు రట్టు చేశారు. జగిత్యాల డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఆర్ ప్రకాశ్ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా సంతమవలూరు మండల కేంద్రానికి చెందిన పాల శ్రీను అలియాస్ మేకల శ్రీను, మేకల లక్ష్మి భార్యాభర్తలు. హైదరాబాద్లోని బాలాపూర్లో నివాసముంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండల కేంద్రానికి చెందిన మేకల రామకృష్ణ-మేకల సరోజిని దంపతులు, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన అరవ సంతోష్ కుమార్ ముఠాగా ఏర్పడ్డారు. టీఎస్ 16ఈపీ 8581 కారులో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ చోరీలకు పథకం వేసుకునే వారు.
ఈ క్రమంలో ఈ నెల 11న జగిత్యాల కొత్త బస్టాండ్లో నిఘా వేశారు. రాఖీ పండుగ రోజున సోదరులకు రాఖీ కట్టేందుకని జగిత్యాల పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన చెన్న వరలక్ష్మి తల్లిగారి ఊరైన రాయికల్ వెళ్లేందుకు ఈ నెల 11న జగిత్యాల కొత్త బస్టాండ్లో ఆర్టీసీ బస్సు ఎక్కింది. గమనించిన దొంగల ముఠాలోని మేకల లక్ష్మి, మేకల సరోజిని వరలక్ష్మి ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులోనే ఎక్కి రాయికల్కు టికెట్ తీసుకున్నారు. మేకల శ్రీను, మేకల రామకృష్ణ కారులో జగిత్యాల బస్టాండ్ నుంచి బస్ను అనుసరిస్తూ వెళ్లారు. ముఠా సభ్యులు బస్సులో వరలక్ష్మితో మాటలు కలిపి బ్యాగులో ఉన్న ఏడు తులాల బంగారు హారాన్ని తస్కరించారు. అనంతరం సింగరావుపేట-శ్రీరాంనగర్ మధ్య బస్సు దిగి వెనకాలే వస్తున్న కారులో ఎక్కి పారిపోయారు. బంగారు నగను అరవ సంతోష్ కుమార్ సాయంతో అమ్ముకొని వరంగల్కు వెళ్లారు. అక్కడ రెండు రోజులుండి మహబూబ్నగర్కు, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట, నంద్యాలకు వెళ్లి జగిత్యాల-రాయికల్ తరహాలోనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల వద్ద నుంచి సైతం చోరీలకు పాల్పడ్డారు. బాధితురాలు వరలక్ష్మి రాయికల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఎస్పీ సింధూశర్మ ఛాలెంజ్గా తీసుకొని జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో జగిత్యాల రూరల్ ఎస్ఐ అనిల్, రాయికల్ ఎస్ఐ పబ్బ కిరణ్తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. సోమవారం రాయికల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఓ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి కారులో ఉన్న ఐదుగురిని విచారించగా, చోరీల విషయాన్ని అంగీకరించారు. మహబూబ్నగర్, ఖమ్మం, నర్సరావుపేట, నంద్యాల ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డ సొత్తును విక్రయించేందుకు రాయికల్ వైపు దొంగల ముఠా వచ్చి చిక్కింది. చోరీ జరిగిన 8 రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించి అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకుని వారి నుంచి 29 తులాల బంగారు, 78 తులాల వెండి నగలు మ్తొతం కలిపి రూ. 13,51,500 విలువైన నగలు, రూ.1500 నగదు, ఐదు సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలతో సహా ఐదుగురిని పట్టుకున్న జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్ఐలు కిరణ్, అనిల్ను డీఎస్పీ అభినందించారు.