నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి సీఎంను కలుస్తా
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
వేములవాడ, మార్చి 28: రీడిజైన్లతో జలాశయాల సామర్థ్యం పెంచి బీడు భూములకు గో దావరి జలాలను అందించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. వేములవాడలోని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సంగీత నిలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకంలో సూరమ్మ చెరువు ఆనాటి పాలకుల ఆలోచనలో చివరి ట్యాంకు అని గుర్తు చేశారు. సూరమ్మ చెరువు పనుల్లో నిర్లక్ష్యం అంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకుల అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అప్పటి ఇరిగేషన్శాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, ఎంపీగా తాను సూరమ్మ చెరువు ద్వారా మరింత ఆయకట్టును పెంపొందించాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ను కలిసి పొడిగించామన్నారు. గోదావరి నదిపై కర్ణాటక, మహారాష్ర్టల్లో అనేక ప్రాజెక్టుల నిర్మాణంతో ఎస్పారెస్పీ నిండలేని పరిస్థితి ఉండేదన్నారు. వరదకాలువలకు సూరమ్మ చెరువు ద్వారా ఎత్తిపోతలతో కథలాపూర్, మేడిపల్లి గ్రామాల రైతులకు సాగునీరు అందించేందుకు రీడిజైన్ చేశారని తెలిపారు. కుడి, ఎడమకాలువల ద్వారా మరింత ఆయకట్టు పెరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను మళ్లించి అనేక బీడు భూములకు ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించిన ఘనత కేసీఆర్దేనన్నారు. చందుర్తి మండలంలోని వరదకాలువల నిర్మాణంలో అనేక భూ సమస్యలు వచ్చినప్పటికీ అధిగమించి పనులను వేగవంతం చేశామని పేర్కొన్నారు.
నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం
శ్రీరాజరాజేశ్వర జలాశయం నిర్వాసితుల సమస్యలన్నింటినీ త్వరలోనే సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి పరిష్కరిస్తామన్నారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం ముంపు గ్రామాల్లో 2008లోనే అనేక పొరపాట్లు జరిగి సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. 95శాతం వాటిని పరిష్కరించడమే కాకుండా ఆర్అండ్ఆర్ కాలనీల ద్వారా అనేకమంది నిర్వాసితులు స్థిరపడ్డారని తెలిపారు. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ కృష్ణభాస్కర్కు సమస్యలను వివరించామని, భూసేకరణ విభాగానికి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ను కూడా ప్రభుత్వం కేటాయించిందన్నారు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలోనూ ముంపు గ్రామాలు ఉన్నందున ఆయనతో కలిసి పరిష్కారం చేస్తామన్నారు. అయినప్పటికీ ఇండ్లు మునిగి, భూములు కోల్పోయిన వారి సమస్యలున్నందున ఇరిగేషన్శాఖ మంత్రి గా ఉన్న సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి అన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. 18 ఏండ్లు నిండిన వారికి ఇప్పటికే రూ.3.50 కోట్లు చెల్లించామని, మిగతావారికీ పరిహారం అందిస్తామని చెప్పారు.
ప్రజాసేవలో చెన్నమనేని కుటుంబం
స్వాతంత్య్ర ఉద్యమం నుంచే ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేసేది చెన్నమనేని కుటుంబమని వినోద్కుమార్ అన్నారు. దివంగత చెన్నమనేని రాజేశ్వర్రావు స్వాతంత్య్ర ఉద్యమకారుడిగా, ఈ ప్రాంత రైతాంగానికి దున్నేవాడికి భూమి దక్కాలని పోరాటం చేశారని గుర్తు చేశారు. చెన్నమనేని రమేశ్బాబు 2009 నుంచి ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆయన జర్మనీలో ఉండాల్సి వచ్చిందని వివరించారు. 2009లో అప్పటి నిబంధనల ప్రకారం పౌరసత్వం పొందారని, వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున రాద్ధాంతం చేయడం సరైంది కాదన్నారు. వేములవాడలో ఉప ఎన్నికలు వస్తే తాను పోటీచేస్తాననే వార్తలు అవాస్తవమని ఖండించారు. వ్యాక్సినేషన్ చేయించుకున్న ఎమ్మెల్యే రమేశ్బాబు త్వరలో వేములవాడకు వస్తారని వివరించారు. సమావేశంలో రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్లు న్యాలకొండ అరుణ, దావ వసంత, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, టీఆర్ఎస్ జిల్లా సభ్యత్వ ఇన్చార్జి కర్ర శ్రీహరి, ఎంపీపీలు బూర వజ్రమ్మ, చంద్రయ్యగౌడ్, జగిత్యాల జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్రావు, జడ్పీటీసీ సభ్యులు మ్యాకల రవి, యేస వాణి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, న్యాలకొండ రాఘవరెడ్డి, రామతీర్థపు రాజు, పుల్కం రాజు, జడల శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రిలయన్స్ సహా టాప్-7 ఎం-క్యాప్ రూ.1.07 లక్షల కోట్లు హరీ