కూడవెల్లి వాగుద్వారా తరలివస్తున్న కాళేశ్వర గంగ
ఇప్పటికే 30 పైగా చెక్డ్యాంలను నింపి కిందికి పరవళ్లు
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో 1300ల క్యూసెక్కులకు పెంచిన అధికారులు
నేటి సాయంత్రానికి జలాశయానికి చేరే అవకాశం
రాజన్న సిరిసిల్ల, మార్చి 28 (నమస్తే తెలంగాణ)/గంభీరావుపేట: సమైక్య పాలకుల నిలువెత్తు నిర్లక్ష్యంతో చుక్క నీరు లేక ఎడారిగా మారిన మెట్ట ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టుతో మహర్దశ వచ్చింది. తెలంగాణ సర్కారు పూర్తి చేసిన శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్టు ద్వారా సిరిసిల్ల పట్టణానికి గోదావరి జలాలు ఎదురెక్కి రాగా, భూగర్భ జలాలు అమాంతం పెరిగాయి. మరోవైపు శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్ నుంచి ఇల్లంతకుంట మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్కు వారం రోజులుగా నీటిని తరలిస్తున్నారు. ఐదు రోజులుగా అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్కు, అక్కడి నుంచి ప్రధాన కాలువ ద్వారా మల్లన్నసాగర్ పంప్హౌస్కు గోదావరి జలాలు వస్తుండగా, అక్కడి నుంచి కొండ పోచమ్మ కెనాల్ ద్వారా కూ డవెల్లి వాగుకు నీటిని అధికారులు విడుదల చేశా రు. అవి వాగుపై నిర్మించిన 39 చెక్డ్యాంలను దా టుకుంటూ ఎగువ మానేరు వైపు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే 30కి పైగా చెక్డ్యాంలు నిండ గా, నేటి సాయంత్రం వరకు గంభీరావుపేట మం డలంలోని ఎగువ మానేరులోకి చేరనున్నాయి.
ఎగువ మానేరుకు పూర్వ వైభవం
ఆదివారం దుబ్బాక మండలం భూంపల్లి వర కు వచ్చిన గోదావరి జలాలు సోమవారం సా యంత్రం నాలుగు గంటలకు ఎగువ మానేరులోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. రెండు టీఎంసీల సామర్థ్యం గల ఈ జలాశయం ఈ వానకాలంలో కురిసిన భారీ వర్షాలకు మత్తడి దూకింది. ఇటీవల ఆయకట్టుకు నీటిని విడుదల చేయగా, ప్రస్తుతం ఒక టీఎంసీ నిల్వ ఉన్నది. కాగా, సోమవారం చేరనున్న గోదావరి నీటితో జలాశయం పూర్తిగా నిండి మండుటెండల్లో నిండుకుండలా మారి సరికొత్త చరిత్ర సృష్టించనున్నది. అంతేకాకుడా జలాశయం పరిధిలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లోని 13 వేల ఎకరాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు అందనున్నాయి.
నీటి విడుదలకు మంత్రి కేటీఆర్ ఆదేశం
ఎగువ మానేరు జలాశయానికి నీటిని విడుదల చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఈఎన్సీ హరిరాం ఆధ్వర్యంలో ప్రాజెక్టు అధికారులు మంత్రిని కలిశారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తున్న విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఎగువ మానేరుకు నీటిని విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. దీంతో ఇప్పటికే విడుదలవుతున్న 800 క్యూసెక్కులను అధికారులు 1300కు పెంచారు. ఫలితంగా కూడెల్లి వాగులో ప్రవాహ ఉధృతి పెరిగింది. నేడు చేరుకోనున్న గోదావరి జలాలకు సిరిసిల్ల నియోజకవర్గంలోని రైతులు ఘనంగా హారతిచ్చి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.
ఎల్ఐసీ ద్వారానే రూ.లక్ష కోట్లు
మే చివర్లోగా ఎయిర్ ఇండియా అమ్మకం: పురి