జాతీయ స్థాయిలో ఉమ్మడి జిల్లా ఖ్యాతి
ఈ సారి సశక్తికరణ్లో మెరిసిన నాలుగు గ్రామాలు, రెండు మండలాలు
ఒకే గ్రామానికి రెండు అవార్డులు
సర్వత్రా హర్షాతిరేకాలు
కరీంనగర్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా, మండల ప్రజా పరిషత్లు, గ్రామ పంచాయతీల్లో ఉత్తమమైన వాటిని గుర్తించి, ఏటా అవార్డులు ప్రకటిస్తున్నది. వీటిని ఏటా ఏప్రిల్ 24న నిర్వహించే ‘జాతీయ పంచాయతీ దివస్’ కార్యక్రమంలో నగదు పురస్కారంతోపాటు ప్రదానం చేస్తున్నది. 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తికరణ్’ పురస్కారాల కింద జిల్లా ప్రజా పరిషత్లకు 50 లక్షలు, మండల పరిషత్లకు 25 లక్షలు, గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన 5 లక్షల నుంచి 15 లక్షల వరకు నగదు పురస్కారాలు అందిస్తున్నది. పారిశుధ్య నిర్వహణ, మంచి నీరు, వీధి దీపాలు, మౌలిక వసతుల కల్పన వంటి పౌర సేవల నిర్వహణ, సహజ వనరుల నిర్వహణ, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం, సాంఘిక భద్రత కార్యక్రమాలు, విపత్తుల నిర్వహణ, సీబీవో, ఎన్జీవోల సహకారంతో గ్రామాభివృద్ధి, వినూత్న పద్ధతుల ద్వారా వనరుల పెంపు, ఈ గవర్నెన్స్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అవార్డుల కోసం ఎంపిక చేస్తారు.
పోటీ తత్వం పెంచుతున్న శిక్షణ..
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డుల ఎంపిక కోసం ఉమ్మడి జిల్లా అధికారులు ప్రత్యేక కార్యాచరణ కనబరుస్తున్నారు. ముఖ్యంగా ప్రతి పంచాయతీ, మండల పరిషత్లకు శిక్షణ ఇస్తున్నారు. ఈ అవార్డులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ముందు ఏ విభాగంలో ఎలా ప్రగతి సాధించాలి?, ఎలాంటి ప్రగతి సాధిస్తే అవార్డులకు ఎంపికవుతామనే విషయాలతోపాటు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అందించే మార్గదర్శకాలపై అక్టోబర్, నవంబర్ నెలల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు జిల్లా ప్రజా పరిషత్లో ఒక శిక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం మేనేజర్లు సురేందర్, సంతోష్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్లి ప్రజా ప్రతినిధులు, అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు వచ్చే మార్గదర్శకాలను ఆయా పంచాయతీలు, మండల పరిషత్లకు ఈ-మెయిల్స్, వాట్సాప్ల ద్వారా చేరవేస్తున్నారు. అంతే కాకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు, డీపీవోలు కూడా పంచాయతీ కార్యదర్శులు విధులు సక్రమంగా నిర్వహించేలా పర్యవేక్షిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని అనేక పంచాయతీలు జాతీయ అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నాయి.
స్ఫూర్తిగా..
కేంద్రం ప్రకటిస్తున్న జాతీయ స్థాయి అవార్డులను కరీంనగర్ ఉమ్మడి జిల్లా దక్కించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి స్ఫూర్తిగా నిలుస్తున్నది. అవార్డుల ఎంపిక కోసం తీసుకున్న అంశాల్లో ఎక్కువ శాతం పల్లె ప్రగతి పనుల్లో ఇమిడి ఉన్నాయి. హరితహారం, పల్లె ప్రకృతి వనాలు దోహదపడుతున్నాయి. పారిశుధ్య నిర్వహణకు ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ సమకూర్చుకుంది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి పల్లెకు స్వచ్ఛమైన తాగునీటి వనరులు లభిస్తున్నాయి. పారిశుధ్యంలో కీలమైన సెగ్రిగేషన్ షెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణంలో కూడా ఉమ్మడి జిల్లా ముందంజలో ఉన్నది. పారిశుధ్యంతోపాటు, మానవ వనరుల అభివృద్ధి సూచిక కింద వైకుంఠధామాలను ఏర్పాటు చేయడంతో కేంద్ర ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకున్న అంశాలన్నింటికీ ఉమ్మడి జిల్లా సరితూగుతున్నది.
నాలుగేళ్లలో వరుసగా అవార్డులు..
ఉమ్మడి జిల్లా జాతీయ స్థాయిలో ఎప్పటి నుంచో చోటు దక్కించుకుంటున్నది. వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకుని ప్రథమంగా ఓడీఎఫ్ పరిధిలోకి వచ్చింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటిస్తున్న అవార్డులకు వరుసగా ఎంపికవుతున్నది. 2016-17లో శ్రీరాంపూర్ మండల పరిషత్, వెలిచాల, దుద్దెనపల్లి, ముష్టిపల్లి గ్రామాలకు అవార్డులు దక్కాయి. 2017-18లో మంథని, వెల్గటూర్ మండల పరిషత్లు, రాఘవాపూర్ గ్రామ పంచాయతీకి వచ్చాయి. 2018-19లో సుల్తానాబాద్ మండల పరిషత్, కిష్టంపేట, గంగారం, ఆదివారంపేట, నుస్తులాపూర్ గ్రామ పంచాయతీలు అవార్డులకు ఎంపికయ్యాయి.