హైదరాబాద్ : అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ గ్రీన్ఫండ్ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు అన్నారు. దీని ద్వారా పచ్చదనం పెంపును ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకునే వీలును గ్రీన్ఫండ్ కల్పిస్తుందన్నారు. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో జరుగుతున్న ‘సింబా – ద ఫారెస్ట్ మ్యాన్’ షూటింగ్లో పాల్గొన్నారు. ‘మనకు బతుకునిచ్చే మొక్కను బతకనిద్దాం’ అనే నినాదంతో ఈ చిత్రం రూపొందుతోంది. అడవులు, పర్యావరణం ప్రాధాన్యత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు అటవీ అధికారి పాత్ర పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సంపత్ నంది, మిగతా యూనిట్ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్తో కలిసి జగపతిబాబు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని, అదే సమయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్తో ఎంపీ సంతోష్ కుమార్ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారని కొనియాడారు. అన్ని వర్గాలను గ్రీన్ ఇండియాలో భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ పీవీ రాజారావు, దర్శకుడు సంపత్ నంది, నిర్మాతలు రాజేందర్ రెడ్డి, మురళీ మనోహర్ రెడ్డి, యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి, హీరోయిన్ దివి వధ్వ, ప్రతి నాయకుడు కబీర్ దుహన్ సింగ్, చిత్ర యూనిట్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అంతకు మందు ఫారెస్ట్ అకాడమీకి తొలిసారి వచ్చిన ఎంపీ సంతోష్ కుమార్కు డైరెక్టర్ పీవీ రాజారావు స్వాగతం పలికారు. దూలపల్లిలో ఉన్న తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ప్రత్యేకతను వివరించారు. తెలంగాణతో పాటు, వివిధ రాష్ట్రాల నుంచి ఫారెస్ట్ సర్వీసుకు ఎంపికైన వారికి అకాడమీలో ఉత్తమ శిక్షణ లభిస్తుందని వెల్లడించారు. ఫారెస్ట్ అకాడెమీ అధికారులు, సిబ్బందితో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.