విజయవాడ: గతంలో హెచ్చరించినట్లుగానే దాదాపు 50 మంది ఎమ్మెల్యేల పనితీరుపై వైసీపీ అధినేత అసంతృప్తిగా ఉన్నట్లు తేలింది. వీరికి వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే బృందం నుంచి జగన్కు నివేదిక అందినట్లు సమాచారం. ఈ నివేదికపై జగన్ సీరియస్గా ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
దాదాపు 50 మంది ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేకపోవడం పట్ల వైసీపీ అధినేత సీరియస్గా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇలాంటి వారిని పిలిచి క్లాసు తీసుకున్న జగన్.. పనితీరు మెరుగుపరుచుకోవాలని హెచ్చరిక జారీ చేశారని సమాచారం. ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్న జగన్.. వారు చేస్తున్న తప్పులను, ఎలా ముందుకు పోతే ప్రజల్లో పేరు పొందవచ్చో కూడా చెప్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తీరు మార్చుకోనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో మరో దఫా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కోల్పోతారని హెచ్చరించినట్లుగా తెలుస్తున్నది. టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టడంలో విఫలమైన మంత్రులను ఘాటుగా హెచ్చరించిన విషయం తెలిసిందే.
మిషన్ 2024పై ఆసక్తిగా ఉన్న వైసీపీ అధినేత జగన్.. వివిధ సర్వేల ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై కన్నేసి ఉంచారు. కొత్తగా చేరిన కొందరు మంత్రుల పనితీరుపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ముగిసిన క్యాబినెట్ సమావేశంలో కొందరు మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల ఆరోపణలపై కౌంటర్ ఇచ్చేందుకు మాజీ మంత్రులు, మంత్రులు మీడియా ముందుకు వస్తున్నట్లు కనిపిస్తున్నది.