నల్లగొండ, మార్చి 9 : ఆరేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 1.32 లక్షల ప్రభుత్వ, 15 లక్షల ప్రైవేట్ ఉద్యోగావకాశాలు కల్పిస్తే.. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలిస్తానన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. మంగళవారం నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రమూ 10 వేలకు మించి ఉద్యోగాలు ఇవ్వలేదని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇస్తే ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలు బూతులతో పబ్బం గడుపుతున్నారని, అవే మాటలు అందరికీ వస్తాయన్న విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండగా.. వాటిని నిర్మూలించేందుకే సీఎం కేసీఆర్ సంక్షేమ రంగాన్ని కాపాడుతున్నారని చెప్పారు ఈ తరుణంలో పీఆర్సీ కాస్త ఆలస్యమైందని, ఈ విషయం ఉద్యోగులందరికీ తెలుసన్నారు. ఎన్నికల ముందు బీజేపీ చెప్పిన విధంగా విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చిందా..? ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు ఎందుకు వేయట్లేలేదన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేదల నడ్డి విరిచింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.
ప్రశ్నించే గొంతుకలతో ఉపయోగం లేదని, సమస్యలను పరిష్కరించే వ్యక్తి అవసరమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సాయుధ పోరాటం నుంచి తొలి, మలిదశ ఉద్యమాలు ప్రశ్నలతోనే ప్రారంభమయ్యాయని, తెలంగాణ ఏర్పాటుతో ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికిందని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నీటి వాటాలు వచ్చాయని.. ఇప్పుడు రాష్ట్రంలోని చెరువులు, కాల్వలు నిండాయని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తవుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు పెరిగాయని వెల్లడించారు. గత యాసంగిలో దేశంలో పండిన ధాన్యంలో 54 శాతం మన దగ్గరే పండించినట్టు తెలిపారు. పట్టభద్రులు తనను మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నయీంనగర్/ఖిలా వరంగల్, మార్చి9 : దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నదని, కేంద్రం ఎన్నోసార్లు ఈ విషయంలో రాష్ర్టాన్ని ప్రశంసించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. వరంగల్ నగరంలోని రాంకీకాలనీలో మంగళవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో వినోద్కుమార్ మాట్లాడారు. తెలంగాణలో నీళ్లు, నిధులు, కరెంట్కు కొరత లేదని చెప్పారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సత్తా సీఎం కేసీఆర్కే ఉన్నదని చెప్పారు. బీజేపీ అవాస్తవ ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం రాంకీకాలనీ కమిటీ ఆధ్వర్యంలో వినోద్కుమార్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ, తూర్పు ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, నన్నపునేని నరేందర్, మేయర్ గుండాప్రకాశ్రావు, కుడా చైర్మన్ మర్రియాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లవేళలా సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని కొనసాగేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్ వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.
-తలసాని శ్రీనివాస్యాదవ్, పశుసంవర్ధకశాఖ మంత్రి
పట్టభద్రులను ఓట్లడిగే హక్కు ప్రతిపక్షాలకు లేదు. గడిచిన ఆరేండ్లలో తెలంగాణలో 1.32 లక్షల ఉద్యోగాలిచ్చాం. సమైక్య పాలనలో ఏ ప్రభుత్వమూ ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలపై ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను పట్టభద్రులు నమ్మొద్దు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలి. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.వేల కోట్లు పన్నుల రూపంలో వెళ్తున్నా.. తిరిగి రాష్ర్టానికి రావాల్సిన వాటాను ఇవ్వకుండా వివక్ష చూపుతున్నది.
-నామా నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. కొత్త సాగు చట్టాలతో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలకు బుద్ధి చెప్పేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి.
– మందుల సామేల్, తెలంగాణ రాష్ట్ర గిడ్డండుల సంస్థ చైర్మన్
బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించింది సీఎం కేసీఆరే. పేద బ్రాహ్మణుల అభివృద్ధికి నల్లగొండ జిల్లాలోనే 353 మందికి రుణాలిచ్చారు. వేద పాఠశాల ఏర్పా టు, విదేశీ విద్య కోసం 32 మందికి రుణాలు అందించారు. సీఎం సూచించిన పల్లాకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.
-సముద్రాల వేణుగోపాలాచారి ,ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి