హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశాభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి విజనరీ దేశ రాజకీయాలకు అవసరమని భారతజాతి ఆకాంక్షిస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్ను సమర్థిస్తూ శనివారం జడ్చర్ల నుంచి వందలాది కార్లతో భారీ ర్యాలీగా బయలుదేరి తెలంగాణభవన్కు చేరుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారం కోసమే పుట్టిన పార్టీ కాదని, బీఆర్ఎస్ కూడా అధికారం కోసం పుట్టిన పార్టీ కాదని తెలిపారు. అప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం, ఇప్పుడు దేశాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ బయల్దేరారని వివరించారు. అధికారంలో టీఆర్ఎస్ పార్టీ, సీఎంగా కేసీఆర్ ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు తీర్పివ్వటంతో తొలిసారి అధికారంలోకి వచ్చామని, ప్రజలు ఆశించినదానికన్నా ఎక్కువ పనిచేయటం వల్ల రెండోసారి అధికారంలోకి వచ్చామని తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను మార్చేందుకు బయలుదేరిన సీఎం కేసీఆర్కు అన్నివిధాలా అండగా ఉండాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయయడ్డారు. బీజేపీ, కాంగ్రెస్కు అధికార యావ తప్ప ప్రజల జీవితాలు బాగుచేయాలనే ఉద్దేశం లేదని దుయ్యబట్టారు. వనరులను సక్రమంగా వినియోగిస్తే అనతికాలంలోనే తెలంగాణ తరహాలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రభాగాన నిలుస్తుందని, అది కేసీఆర్కే సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్ వాల్యానాయక్, జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ డీ లక్ష్మి, జడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిన్నంటిన సంబురాలు
జడ్చర్ల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో తెలంగాణ భవన్ కోలాహలంగా మారింది. డప్పు చప్పుళ్లు.. నృత్యాలతో శ్రేణులు ధూంధాం సంబురాలు చేసుకున్నాయి. స్వీట్లు పంచుకోవటంతో ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొన్నది.