పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టీ20 ఫ్రాంచైజీ లీగ్లతో సంప్రదాయ క్రికెట్కు పెనుముప్పు పొంచి ఉందని భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ అభిప్రాయపడ్డాడు. పరిస్థితులను గమనిస్తుంటే ప్రస్తుతం క్రికెట్.. యూరప్ ఖండంలో ఫుట్బాల్ మాదిరిగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. టెస్టు, వన్డే క్రికెట్ను కాపాడుకోవాలంటే ఐసీసీ వీటిపై దృష్టి సారించాలని కోరాడు.
ఓ విదేశీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్దేవ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం క్రికెట్ను చూస్తుంటే యూరప్లో ఫుట్బాల్ వలే మారుతుందేమో అనిపిస్తున్నది. వాళ్లు ప్రతి దేశంతో మ్యాచ్ ఆడరు. ప్రతీ నాలుగేండ్లకు ఒకసారి ప్రపంచకప్ ఆడతారు. క్రికెట్ ప్రయాణం కూడా ఇలాగే సాగుతోంది. ఇదే క్రికెట్లో కొనసాగితే ప్రపంచకప్లలో మాత్రమే ఆడి మిగిలిన సమయంలో తమ తమ క్లబ్ (ఫ్రాంచైజీ) లకు ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ టీ20 క్రికెట్నే కాకుండా టెస్టు, వన్డేలనూ బతికించాలి. అవి ఆడటానికీ తగిన సమయం కేటాయించాలి..’ అని పేర్కొన్నాడు.
క్రికెట్లో ఇప్పుడు టీ20 యుగం నడుస్తున్నది. ప్రస్తుతం వన్డేలు ఆడేందుకు ఏ జట్టు, ఆటగాళ్లు కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు. బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) రిటైర్మెంట్ తర్వాత వన్డే క్రికెట్ మనుగడ మీద చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఆటగాళ్లు కూడా తమకు కాసులు కురిపించే ఫ్రాంచైజీ లీగ్ల వైపునకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కపిల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ద్వైపాక్షిక సిరీస్లకు గాయాల పేరు చెప్పి తప్పించుకుంటున్న క్రికెటర్లు ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, ది హండ్రెడ్ వంటి లీగ్ లలో మాత్రం తప్పకుండా ఆడుతున్నారు. వీటికి తోడు కొత్తగా వచ్చే ఏడాది నుంచి దక్షిణాఫ్రికా, యూఏఈలలో కూడా కొత్త టీ20 లీగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. దీంతో క్రికెట్ షెడ్యూల్ ఊపిరాడకుండా ఉండనుంది.