న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: కాశీలో మరణిస్తే పుణ్యలోకాలు సిద్ధిస్తాయని నమ్మేవారికోసం వారణాసిలో ఇటీవల ‘ముముక్షు భవన్’ పేరిట వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. దైవధ్యానంలో చివరి క్షణాలు గడపాలనుకునేవారు ఇక్కడకు రావచ్చని నిర్వాహకులు అంటున్నారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసిన దండి స్వామీజీల మోక్ష మందిరంలోనే ముముక్షు భవన్ ఏర్పాటు చేసినట్టు కాశీ ప్రత్యేక ప్రాంత అభివృద్ధి బోర్డు చైర్మన్ దీపక్ అగర్వాల్ తెలిపారు. గొడౌలియాలో, అస్సీఘాట్ సమీపంలో ఇలాంటి మోక్షధామాలు ఉన్నప్పటికీ కాశీవిశ్వనాధ ఆలయ ప్రాంగణంలో ఉండడం దీని ప్రత్యేకత.