Moonlighting | మూన్ లైటింగ్.. భారత ఐటీ రంగాన్ని వేధిస్తున్నది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి అన్ని సంస్థలు వర్క్ ఫ్రం హోం సేవలను ప్రారంభించాయి. ఈ టైమ్లో డిజిటల్ సేవలకు పెరిగిపోవడంతో ఐటీ దిగ్గజాలు ఇతర సంస్థల్లో పని చేస్తున్న నిపుణుల సేవలను వినియోగించుకున్నాయి. నిపుణులు సైతం కుటుంబ అవసరాల కోసం అదనపు సమయంలో ఇతర సంస్థలకు పని చేయడాన్ని మూన్ లైటింగ్ అంటున్నారు. ఒక సంస్థలో పని చేస్తూ.. ఖాళీ టైంలో మరో సంస్థకు సేవలందించడాన్నే మూన్ లైటింగ్ అంటున్నారు. మూన్ లైటింగ్కు పాల్పడుతున్న 300 మంది ఉద్యోగులకు విప్రో ఉద్వాసన పలకడంతో ఐటీ రంగంలో వాడీ వేడీ చర్చ జరుగుతున్నది. మూన్ లైటింగ్పై ఐటీ రంగ నిపుణులు రెండుగా చీలిపోయారు.
ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ క్రిష్ గోపాల కృష్ణన్, మోహన్ దాస్ పాయ్ నుంచి విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ పరస్పరం విభేదిస్తున్నారు. వివిధ ఐటీ సంస్థల్లో పని చేస్తున్న వారిలో సుమారు 65 శాతం మంది ఐటీ ప్రొఫెషనల్స్ `మూన్ లైటింగ్`లో పని చేస్తున్నారని కొటక్ ఇన్స్టిట్యూసన్ ఈక్విటీస్ నిర్వహించిన సర్వేలో తేలింది. దాదాపు 400 మంది ఐటీ నిపుణులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు.
విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ బహిరంగంగా మూన్ లైటింగ్ను వ్యతిరేకిస్తున్నారు.మూన్ లైటింగ్ ఫ్రాడ్ అని పలు బహిరంగ వేదికలపై వ్యాఖ్యానించారు. మూన్ లైటింగ్ను ఇన్ఫోసిస్ వ్యతిరేకించింది. మూన్ లైటింగ్కు పాల్పడే వారికి హెచ్చరికలు జారీ చేసింది. ఉద్వాసన పలుకుతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో `మూన్ లైటింగ్` నైతికత, చట్టబద్ధతపై హాట్ హాట్గా చర్చ సాగుతున్నది.
మూన్ లైటింగ్పై రెండుగా చీలిపోయిన ఐటీ దిగ్గజాలేమంటున్నారో తెలుసుకుందాం..
ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పని చేయడం విశ్వాసాన్ని ఉల్లంఘించడమేనని ఇన్పోసిస్ కో-ఫౌండర్ క్రిష్ గోపాలకృష్ణన్ పేర్కొన్నారు. ఇతర ఉద్యోగాలు చేసే వారి నుంచి ఉత్పాదకతపై ప్రభావం పడుతుందని, ఈ పరిణామం వైరుధ్యాలకు, డేటా ఉల్లంఘనకు దారి తీస్తుందని హెచ్చరించారు.
మూన్లైటింగ్కు పాల్పడటం ఉద్యోగులు సంబంధిత రెండు సంస్థలను మోసగించడమేనని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ స్పష్టం చేశారు. దీన్ని ఎంతమాత్రం ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్దాస్ పాయ్ మాత్రం మూన్ లైటింగ్ జీవితంలో ఒక భాగమేనంటున్నారు. `ఒకవేళ నాకు అదనపు మనీ అవసరం అని భావిస్తే శనివారం కూడా నేను పని చేస్తా. అలా చేయకుండా నన్నెవరూ ఆపలేరు` అని చెప్పారు. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ సైతం మూన్ లైటింగ్ను సమర్థించారు. ఏ ఉద్యోగికైనా తమ శక్తి సామర్థ్యాలను బట్టి అదనపు ఆదాయం సంపాదించుకునే హక్కు ఉంటుందన్నారు. పూర్తిగా పారదర్శకతతో సుదీర్ఘ కాలం జరగాల్సిందేనన్నారు. కానీ ప్రస్తుతానికి ఇలా జరిగేలా కనిపించడం లేదన్నారు.