సిటీబ్యూరో, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ): ఏ రంగంలోనైనా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ఉత్పత్తుల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నిర్వహించే కార్యకలాపాలను ఎమర్జింగ్ టెక్నాలజీ అయిన కృత్రిమ మేథస్సుతో సరికొత్త పరిష్కారాన్ని చూపేందుకు ప్రైవేటు కంపెనీతో సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ప్రత్యేకాధికారి రమాదేవిలు నెబులా ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఐటీ శాఖ అధికారు లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న పం టల నాణ్యత పరీక్షలు సంప్రదాయ పద్ధతుల్లో చేస్తే ఎన్నో వివాదాలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ధాన్యం నాణ్యతను తక్షమే నిర్ణయించే అవకాశం కలుగుతుంది. దీని ద్వారా సేకరణ సామర్థ్యం మెరుగుపడుతుంది. పౌర సరఫరాలు, వ్యవసాయ మార్కెటింగ్ కొనుగోలు కేంద్రాల్లో ఈ టెక్నాలజీ అమలు చేయనున్నాం. ప్రాథమికంగా మూడు ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు.