ఒక్కో ఉద్యోగికి రూ.25 లక్షలకుపైనే ఇస్తున్న ఐటీ సంస్థలు..
జాబ్ వెబ్సైట్ సైకీ తాజా నివేదిక
జనవరిలోనూ టెక్ రంగంలో భారీగా నియామకాలు..
మెట్రో నగరాల్లోనే అధికం
ముంబై, ఫిబ్రవరి 23: దేశీయ ఐటీ రంగంలో హైదరాబాద్ ఉద్యోగులే అత్యధిక వేతనాలను అందుకుంటున్నారు. జాబ్ సైట్ సైకీ తాజా నివేదిక ప్రకారం దేశంలోని ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు రూ.25 లక్షలు అంతకంటే ఎక్కువ జీతాలిస్తున్న నగరాల్లో హైదరాబాద్తోపాటు బెంగళూరు ఉందని తేలింది. హైదరాబాద్ ఐటీ రంగ ఉద్యోగులు పెద్ద మొత్తంలో సాలరీలను ఎత్తుకుంటున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇక గతేడాది లాక్డౌన్ నుంచి నియామకాల్లో దూసుకుపోతున్న ఐటీ సంస్థలు.. గత నెలలోనూ దూకుడును ప్రదర్శించాయి. అంతకుముందు నెలతో పోల్చితే జనవరి ఉద్యోగ నియామకాల్లో 39 శాతం వృద్ధి నమోదైంది. తర్వాతి స్థానాల్లో బీపీవో (10 శాతం), బ్యాంకింగ్ (6 శాతం) రంగాలున్నాయి.
మెట్రో నగరాల్లో పెరిగిన కొలువులు హైదరాబాద్, బెంగళూరు, పుణె, ఢిల్లీ తదితర మెట్రో నగరాల్లో ఉద్యోగ నియామకాలు జోరుగా సాగుతున్నాయని ఈ నివేదికలో సైకీ తెలియజేసింది. ముఖ్యంగా ఐటీ సంస్థలు ఈ జనవరిలో తీసుకున్న ఉద్యోగుల్లో మెట్రో నగరాల వాటా 50 శాతానికిపైనే. దేశవ్యాప్తంగా 15వేలకుపైగా ఉద్యోగ నియామకాల నుంచి సైకీ ఈ వివరాలను రాబట్టింది. కాగా, రూ.6 లక్షల కంటే తక్కువ, రూ.6-15 లక్షల మధ్య జీతాలుగల ఉద్యోగాల్లో బెంగళూరు ముందున్నది.
ప్రాజెక్ట్ మేనేజర్లకు డిమాండ్
వివిధ రంగాల్లో ప్రాజెక్ట్ మేనేజర్లకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తున్నట్లు ఈ సందర్భంగా సైకీ వెల్లడించింది. ఐటీ రంగంలో ప్రాజెక్ట్ మేనేజర్లకు అత్యధికంగా 47 శాతం డిమాండ్ వ్యక్తమవగా, ఆ తర్వాత నిర్మాణ (6 శాతం), బ్యాంకింగ్ (4 శాతం), రిక్రూట్మెంట్ (3 శాతం) రంగాలున్నాయి. ఇదిలావుంటే డిజిటల్ మార్కెటింగ్కూ మంచి ఆదరణ కనిపిస్తున్నది. ఇతర పరిశ్రమలతో పోల్చితే ఇక్కడ 30 శాతం అధికంగా నియామకాలు జరుగుతున్నట్లు నివేదికలో సైకీ గుర్తించింది.