శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకున్నది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ ప్రయోగం విజయవంతమయింది. లక్ష్యం దిశగా దూసుకెళ్లిన సీ52 రాకెట్ మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ సోమనాథన్ అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ ప్రయోగం విజయవంతం అయిందని చెప్పారు. మూడు ఉపగ్రహాలను విజయంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టామని వెల్లడించారు.
పీఎస్ఎల్వీ–సీ52 రాకెట్ 1710 కిలోల ఆర్బిట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈఓఎస్–04, 17.50 కిలోల ఐఎన్ఎస్-2డీటీ, 8.10 కిలోల బరువున్న ఇన్స్పైర్శాట్-1 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈఓఎస్ అనేది రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. దీన్ని వ్యవసాయం, అటవీ సంరక్షణ, నేల తేమ, హైడ్రాలజీ, వరదల మ్యాపింగ్కు సంబంధించి అన్ని వాతావరణ పరిస్థితుల్లో హైక్వాలిటీ ఫొటోలను అందించేలా రూపొందించారు. ఐఎన్ఎస్-2డీ ఉపగ్రహాన్ని భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించాయి.