శ్రీశైలం : శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల ఇష్టమ్యాలను సిద్ధింపజేసే ఇష్టకామేశ్వరీ అమ్మవారి ఆలయ దర్శనానికి అటవీ ప్రాంతం గుండా వెళ్లడానికి త్వరలో అనుమతులు రానున్నాయని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. క్షేత్రానికి 20 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉండే ఇష్టకామేశ్వరీ అమ్మవారి ఆలయ దర్శనాలను పలు కారణాలతో రెండేళ్ల కిందట నిలిపివేశారు. కాగా, భక్తుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని.. అమ్మవారి ఆలయానికి వెళ్లేందుకు అటవీశాఖ నిబంధనలను అమలు చేస్తూ గిరిజనుల ఉపాధికి ప్రాధాన్యం ఇస్తూ త్వరలోనే పునః దర్శనాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై మంత్రి బాలినేని శ్రీనివాస్, పీసీసీఎఫ్ ఉన్నతాధికారితో సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. బుధవారం ఎమ్మెల్యే అటవీ ప్రాంతం గుండా స్వయంగా జీపు నడుపుకుంటూ అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు.