పొట్టి ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరిగిన సిరీస్ను టీమ్ఇండియా గెలుచుకుంది. చివరి పోరులో సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ వీరవిహారం చేస్తే.. నాగ్పూర్ వేదికగా జరిగిన 8 ఓవర్ల మ్యాచ్లో హిట్మ్యాన్ రోహిత్ శర్మ వీరంగమాడాడు. అంతకుముందు మొహాలీ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మూడు మ్యాచ్ల్లో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టిన అక్షర్ పటేల్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డు దక్కింది.
అంటే ఇక అంతా కుదురకున్నట్లేనా.. అంటే మాత్రం కాదనే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ సిరీస్లో భారత ఫీల్డింగ్ తీవ్రంగా నిరాశ పరచగా.. పేస్ బౌలర్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. గాయం నుంచి కోలుకున్న ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు పూర్తిస్థాయి మ్యాచ్ ప్రాక్టీస్ లభించకపోగా.. హర్షల్ పటేల్ భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. చాహల్, భువనేశ్వర్ పూర్తిగా విఫలం కాగా.. హార్దిక్ ఫర్వాలేదనిపించాడు!!
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం:టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకునేందుకు టీమ్ఇండియా ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడింది. ఇప్పటికే జట్టు కూర్పు 95 శాతం పూర్తైందని సిరీస్ ఆరంభానికి ముందే కెప్టెన్ రోహిత్శర్మ ప్రకటించగా.. ఈ సిరీస్తో కొత్త సందేహాలు రేకెత్తుతున్నాయి. తొలి మ్యాచ్లో 208 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్.. దాన్ని కాపాడుకోవడంలో విఫలం కాగా.. నాగ్పూర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్ను వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించడంతో టాస్ గెలిచి గట్టెక్కింది. ఇక అచ్చొచ్చిన ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ రాణించడంతో సిరీస్ కైవసం చేసుకుంది. కానీ.. ప్రపంచకప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీ కోసం సిద్ధమవుతున్న జట్టులో ఉండాల్సిన ఆత్మవిశ్వాసం మాత్రం టీమ్ఇండియాలో లోపించిందనేది సుస్పష్టం.
నిలకడే ప్రధాన సమస్య
ప్రతి ఆటగాడు ఒక్కో ఇన్నింగ్స్తో మెరిసినా.. టాపార్డర్లో నిలకడ కనబడటం లేదు. టాప్-3 ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడుతూ ముందుకు సాగే టీమ్ఇండియా.. కలిసి కట్టుగా కదంతొక్కితేనే భారీ విజయాలు సాధ్యమవుతాయి. రాహుల్, రోహిత్, విరాట్ ఒక్కో మ్యాచ్లో మెరుపులు మెరిపించగా.. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కూడా తమ వంతు పాత్ర పోషించారు. వీరిలో రోహిత్, సూర్య, హార్దిక్ మాత్రమే పూర్తి సాధికారిక ఇన్నింగ్స్లు ఆడగా.. రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ బంతితో ఆకట్టుకున్నాడు. ఫినిషర్గా దినేశ్ కార్తీక్కు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పర్చుకోగా.. పేస్ బౌలింగ్ యూనిట్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
అక్షర్, పాండ్యా మెరుగు..
ఆల్రౌండర్ల విషయంలో భారత్కు ఈ సిరీస్ ఇతోధిక సాయం చేసినట్లే! నిన్నమొన్నటి వరకు జట్టులో ఉంటాడో లేదో తెలియని అక్షర్ మూడు మ్యాచ్లు ముగిసేసరికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. కెప్టెన్ ఏ సమయంలో బంతి ఇచ్చినా.. బ్రేక్త్రూ అందిస్తూ ఆకట్టుకున్నాడు. ఫీల్డింగ్లో రెండు క్యాచ్లు మిస్ చేసినా.. ఉప్పల్ పోరులో అద్భుత రనౌట్తో అదరగొట్టాడు. ఇక హార్దిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఐపీఎల్ నుంచి తన ఆటతీరు మార్చుకున్న పేస్ ఆల్రౌండర్.. బంతైనా, బ్యాటైనా వంద శాతం ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొహాలీ పోరులో టాపార్డర్ తడబడిన సమయంలో క్రీజులో నిలిచిన హార్దిక్.. భారీ సిక్సర్లతో జట్టు స్కోరును రెండొందలు దాటించాడు. ఇక మూడు మ్యాచ్ల్లోనూ బంతితో చక్కటి ప్రదర్శన చేస్తూ తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేశాడు. దీంతో టీమ్ మేనేజ్మెంట్కు అతడిపై కొండంత ధీమా ఏర్పడింది. బౌలింగ్లో వాడి పెంచిన పాండ్యా.. అవసరమైతే స్లో బంతులతోనూ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతూ ఆకట్టుకున్నాడు.